రాజమహేంద్రవరం రూరల్/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/తాళ్లపూడి: అనుబంధాలు, ఆప్యాయతల మేళవింపుగా.. మమతానురాగాలకు నెలవుగా.. ఏటా శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించుకునే సోదరీసోదరుల ఆత్మీయ పండగ రక్షాబంధన్. కష్టసుఖాల్లో తమకు అనుక్షణం తోడుగా ఉండాలని కోరుకుంటూ సోదరులకు అక్కచెల్లెళ్లు ఈ సందర్భంగా రాఖీలు (రక్షాబంధన్) కట్టి స్వీట్లు తినిపిస్తారు. అందుకే దీనిని రాఖీ పౌర్ణమిగా కూడా దీనికి పిలుస్తారు. ఈ అన్నాచెల్లెళ్ల వేడుకను శుక్రవారం కోలాహలంగా నిర్వహించుకునేందుకు అక్కచెల్లెళ్లు ఏర్పాట్లు చేసుకున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అందరూ నాలుగు రోజుల ముందు నుంచే రాఖీల కొనుగోలు మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణంగానే రాజమహేంద్రవరం దేవీచౌక్, కంబాల చెరువు, గోకవరం బస్టాండ్ వంటి సెంటర్లతో పాటు జిల్లాలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, చాగల్లు మార్కెట్లలో వ్యాపారులు జోరుగా రాఖీలు విక్రయిస్తున్నారు. దీంతో, మార్కెట్లలో సందడి నెలకొంది.
ఆకట్టుకునే డిజైన్లలో..
చూడగానే కట్టిపడేసేలా మార్కెట్లో వివిధ డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. చెమ్కీలతో చేసినవి, పువ్వులతో తీర్చిదిద్దినవి, ఫొటోలు, కార్టూన్ బొమ్మలు ముద్రించినవి, ముత్యాలు, రుద్రాక్షలు, చందనం, రంగురంగుల పూసల వంటి వాటితో తయారు చేసినవి.. ఇలా విభిన్నమైన రాఖీలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. బ్రాస్లెట్ ఆకారంలో ఉన్న రోల్డ్గోల్డ్ రాఖీలు, సిల్వర్ రాఖీలు, ట్రెండింగ్ రాఖీల వంటివి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఫొటో రాఖీలు, మగ్గులపై ముద్రించిన రాఖీలు ఈ ఏడాది సందడి చేస్తున్నాయి. ఫొటో రాఖీలైతే ఆఫర్ పెట్టి రూ.499, నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. మగ్గులైతే రూ.500కు విక్రయిస్తున్నారు.
ఫ నేడు రాఖీ పౌర్ణమి
ఫ వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న రాఖీలు
ఆన్లైన్లో రాఖీలు
గతంలో అక్కచెల్లెళ్లు సుదూర ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు కొరియర్, పోస్టల్ ద్వారా వారం రోజుల ముందు నుంచే రాఖీలు పంపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అమెజాన్, జొమేటో, బ్లింకిట్ తదితర యాప్ల ద్వారా ఆర్డర్ చేస్తే అరగంటలోపే ఆ రాఖీలు సోదరుల ఇళ్లకు చేరుతున్నాయి. అంతేకాగు.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో సైతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భగవంతుడు ఏర్పరచిన మార్గం
మనిషిని ప్రశాంతంగా ఉంచేందుకు ఈశ్వరుడు ఎన్నో మార్గాలను చూపెట్టారు. అందులో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రక్షాబంధన్ మహోత్సవం కూడా ఒకటి. కేవలం తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా సృష్టిలోని ప్రతి వ్యక్తినీ సోదర భావంతో చూస్తూ, అందరికీ రాఖీ కట్టడం ద్వారా కొత్త బంధాలను బ్రహ్మకుమారీలు ఏర్పరచుకుంటున్నారు.
– సిస్టర్ పార్వతి, బ్రహ్మకుమారీ సంస్థ, ఆర్యాపురం, రాజమహేంద్రవరం


