అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు అంబాజీపేట విద్యార్థినులు పలువురు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ శ్రీకాకుళం వైఎస్సార్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఈ విద్యార్థులు ప్రతిభ చూపి 4 గోల్డ్, 3 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్స్ విభాగంలో జి.జెస్సీ లేఖన, జి.లాహిత తేజ, జూనియర్స్ విభాగంలో పి.ఆదిత్య, కె.వైష్ణవి స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. ఎంఎస్ శివానంది, కేకేఎస్ హరిప్రియ, క్యాడిట్ విభాగంలో ఎం.మౌనిక సిల్వర్ మెడల్స్ సాధించారు. వైఈఎన్ శ్రీనిజ, ఎస్.శౌర్య, జూనియర్స్ విభాగంలో పీఎల్ శరణ్య, పి.చరణ్యశ్రీ, ఆర్డీఎస్ లక్ష్మి, ఆర్హెచ్వీ మూర్తి, జి.పూజిత కాంస్య పతకాలు దక్కించుకున్నారు. గోల్డ్ మెడల్స్ సాధించిన జెస్సీ లేఖన, జి.లాహిత తేజ, ఆదిత్య, వైష్ణవి త్వరలో మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థినులను, వారికి తర్ఫీదునిచ్చిన పి.భార్గవి శ్రీకళ, టి.రాజశేఖర్, డి.రాఘవేంద్రలను అంబాజీపేట క్రీడా ప్రాంగణంలో మంగళవారం పలువురు అభినందించారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
రాజానగరం: ఓ బాలికపై అ ఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠి న కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ లోని ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన 16 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన చిర్రా ఆనంద్కుమార్ మాయమాటలతో నమ్మించి, 2020 ఆగస్టు 25న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్సై యు.నాగబాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిందిగా చెప్పారని సీఐ తెలిపారు. ఈ కేసులో శ్రీదేవి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.


