రామచంద్రపురం రూరల్: కాలువలో స్నానానికి వెళ్లి అన్నాచెల్లెళ్లు (ముగ్గురు) మృత్యువాత పడిన ఘటనతో రామచంద్రపురం మండలం వెలంపాలెంలో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకుంది. కాలువలో స్నానం చేయాలన్న ఆ చిన్నారుల సరదా ముగ్గురు తల్లులకు గర్భశోకం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోతుల మధు సాల్మన్ రాజు, శాంతకుమారి దంపతులకు నలుగురు కుమార్తెలు. ఏడాది క్రితం మధు సాల్మన్ రాజు మృతి చెందడంతో గురువారం హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, రావులపాలెం సమీపంలోని తాతపూడి వద్ద ఉంటున్న నాలుగో కుమార్తె తమ పిల్లలతో సహా వెలంపాలెం గ్రామానికి వచ్చి కార్యక్రమం నిర్వహించుకున్నారు.
ఒకరిని కాపాడబోయి మరొకరు..
హైదరాబాద్ చందానగర్లో ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలు శనివారం తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. శుక్రవారం కాకినాడ బీచ్కు, కోరంగి అభయారణ్యానికి వెళదామని అనుకున్నారు. కానీ వెళ్లకపోవడంతో సాయంత్రం పెద్ద కుమార్తె బొక్కే లత కుమారుడు వీరేంద్ర (18) మరో ఆరుగురు చిన్నారులను బైక్పై ఎక్కించుకుని సమీపంలోని వెంకటాయపాలెం కాలువ వద్దకు స్నానానికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మూడో కుమార్తె వేమన మంజుప్రియ కుమార్తె వర్షిత పావని (15) నీటి మునిగి పోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో వీరేంద్ర, రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత కుమారుడు రంజిత్ కుమార్ (15) కూడా నీట మునిగి మృత్యువాత పడ్డారు. వారితో పాటు వెళ్లిన మిగిలిన చిన్నారులు వెంటనే ఇంటిలోని వారికి, స్థానికులకు సమాచారం అందించారు.
మృతదేహాల వెలికితీత
ఆర్డీఓ సరళావతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, సీఐ ఎం. వెంకట నారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ఫైర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది గత ఈతగాళ్ల సహకారంతో రెస్క్సూ నిర్వహించి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులకు అండగా నిలిచారు.
పేద కుటుంబాలే..
ఫ పెద్ద కుమార్తె బొక్కే లత, గనిరాజు దంపతులది పసలపూడి. భర్త కర్ణాటకలో వెల్డింగ్ పని నిమిత్తం ఉంటుండగా లత తన తల్లి శాంతకుమారితో కలసి హైదరాబాద్ చందానగర్లో ఇళ్లల్లో పని చేసుకుంటూ కుమారుడు, కుమార్తెతో కలసి జీవిస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడిని పోగొట్టుకుని కన్నీరుమున్నీరు అవుతోంది.
ఫ రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత, సత్యనారాయణ దంపతులది అంగర గ్రామం. హైదరాబాద్లో వాచ్మన్గా పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ ప్రమాదంలో పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నారు.
ఫ మూడో కుమార్తె వేమన మంజు ప్రియ, భర్త ఆనంద కుమార్లది అంగర సమీపంలోని పడమర ఖండ్రిగ గ్రామం. ఆనంద కుమార్ చనిపోవడంతో మంజు ప్రియ హైదరాబాద్ చందానగర్లో ఇళ్లలో పనిచేసుకుంటూ తన కుమారుడు, కుమార్తెలతో జీవిస్తోంది. ఈ ప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది.
బొక్కే వీరేంద్ర, వేమన వర్షిత పావతి,
కనికెళ్ల రంజిత్ కుమార్ మృతదేహాలు
రాఖీ కట్టి వెళతామన్నారు
హైదరాబాద్కు శనివారం తిరుగు ప్రయాణం నిమిత్తం టికెట్లు తీసుకున్న నేపథ్యంలో తమ చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని వెళతామని తన అక్కల కుమారులు చెప్పినట్టు కాళిదాసు రాజకుమారి (నాలుగో కుమార్తె) కన్నీంటి పర్యంతమైంది. వారందరూ కాలువకు వెళ్లిన తర్వాత తాను తన చిన్న కుమార్తెకు చెవి పోగులు కుట్టించాలని బైక్ తీసుకుని రమ్మని పలుమార్లు ఫోన్ చేశానని తెలిపింది. అయితే ఫోన్ను వారితో పాటు వెళ్లిన తన పెద్ద కుమార్తెకు ఇచ్చేసి వారు స్నానానికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫ కాలువలో స్నానానికి వెళ్లి
ముగ్గురు చిన్నారుల మృతి
ఫ వీరందరూ అక్కాచెల్లెళ్ల పిల్లలే
ఫ తాతయ్య సంవత్సరీకానికి రాక
ఫ తెల్లవారితే హైదరాబాద్కు
బయలుదేరేవారే..
ఫ ఇంతలో కాటేసిన మృత్యువు
ఫ మూడు కుటుంబాలకు తీరని శోకం


