పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం పి.దొంతమూరు శివారున జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న పామాయిల్ తోటలో 92 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి ఉందని వచ్చిన సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై, సిబ్బంది, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, వీఆర్వోల సమక్షంలో పామాయిల్ తోట వద్ద గాలింపు చేపట్టామన్నారు. పామాయిల్ తోటలో ఒక చోట గంజాయి బస్తాలను గుర్తించామని దాని బరువు 92 కేజీలు ఉందన్నారు. ఆ గంజాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వాహనంలో తీసుకుని వచ్చి అక్కడ దాచి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. దొరికిన గంజాయిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.


