● అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్
సత్తి సూర్యనారాయణరెడ్డి
● ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
● వైఎస్సార్ సీపీ మద్దతుదార్ల
ఓట్లు అధికం
● అందుకే ఎన్నిక డిక్లేర్
చేయలేదని విమర్శ
రంగంపేట: మండలంలో జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల నుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని దొడ్డిగుంట గ్రామంలో గురువారం జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికను కోరం ఉన్నప్పటికీ నాటకీయ పరిణామాల నడుమ అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో దొడ్డిగుంట గ్రామానికి చేరుకున్న డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి ఎన్నిక వాయిదా పడటానికి గల కారణాలను స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీలో దొడ్డిగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ నాలుగు గ్రామాలకు చెందిన ఓటర్లు ఎన్నికకు హాజరయ్యారని తెలిపారు. కోరం కూడా సరిపోయిందన్నారు. ఎన్నిక నిర్వహించగా టీడీపీకి 64 మంది, వైఎస్సార్ సీపీకి 140 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని వివరించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుయుక్తుల కారణంగా, శాంతిభద్రతలు లేవని, ఎన్నిక నిర్వహించే ప్రదేశం సరిపోలేదనే సాకులు చెప్పి, అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారని చెప్పారు. శుక్రవారం తాను దొడ్డిగుంట వస్తానని, దమ్ముంటే ఎమ్మెల్యే కూడా రావాలని, ఇద్దరి సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తే ఏ పార్టీ మద్దతుదారులు నెగ్గుతారో తేల్చుకుందామని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సవాలు విసిరారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని అన్నారు.


