కంటైనర్, కారు ఢీ
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై కంటైనర్, కారు ఢీకొన్నాయి. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట సమీపంలో కంటైనర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆ వాహనాలను తనిఖీ చేశారు.
బాలికపై అత్యాచారయత్నం
రాజానగరం: తండ్రి వయసులో ఉన్న ఓ వ్యక్తి కామంతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడి, కటకటాల పాలయ్యాడు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్థానిక ఎస్సై మురళీకృష్ణ గురువారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కలవచర్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం బాగోలేదని బుధవారం స్కూల్కు వెళ్లలేదు. ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి, తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. అదే అదునుగా భావించి, పొరుగింట్లో ఉంటున్న 42 ఏళ్ల కొల్లి విష్ణు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపులు వేసి, ఆ బాలికపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో, బాలిక భయంతో గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో కూలి పనులు ముగించుకుని వచ్చిన ఆ బాలిక తల్లితో పాటు, ఇరుగుపొరుగు రావడంతో నిందితుడు పరారయ్యాడు. విష్ణు ఇద్దరు పిల్లల తండ్రి కూడా. అతడిని అరెస్టు చేసి, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, గురువారం రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు.
మాస్ కాపీయింగ్
ఆరోపణపై నేడు విచారణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాకినాడ జీజీహెచ్లో ఈ నెల 5 నుంచి 13 వరకూ నిర్వహించిన జీఎన్ఎం పరీక్షల్లో లంచాలు, మాస్ కాపీయింగ్ జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 12న ‘నాడి కాదు..నోటు పడితే నర్సింగ్’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం కదిలింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఓఎస్డీలు సహా మరికొంత మందిని విచారించేందుకు కమిటీని నియమించింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఇందుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. రూ.లక్షల మొత్తం చేతులు మారాయన్న ఆరోపణలు, ఓఎస్డీలు పరీక్షల వేళ ప్రైవేటు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశాలు నిర్వహించడం, తమకు అనుకూలమైన విద్యార్థులతో తలుపులు మూసి మరీ కాపీయింగ్ నిర్వహించారని సహ విద్యార్థులే ఆరోపించడం, కీలక అధికారికి ఇప్పటికే స్థానచలనం కల్పించిన నేపథ్యంలో తాజా విచారణ అత్యంత కీలకం కానుంది.
కంటైనర్, కారు ఢీ


