యంత్రాంగం స్పందన అభినందనీయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అనారోగ్యం పాలైన ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా అధికారుల తక్షణ స్పందన అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక కిమ్స్ బొల్లినేని, రెయిన్బో, ఆదిత్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె మంగళవారం పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గణేష్ అనే పాల వ్యాపారి వద్ద పాల శీతలీకరణ యంత్రం నుంచి ఇథిలిన్ గ్లైకోల్ అనే రసాయనం లీక్ కావడం వల్లే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. పాడి పశువులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల్లో బాఽధితులకు అందిస్తున్న వైద్య సేవలను విశాఖపట్నం నుంచి వచ్చిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు పరిశీలించారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అంచనా వేశారు.


