ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టదా?
అల్లవరం: రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ఐదుగురు మృత్యువాత పడటం, పలువురు ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్తీ పాలు, కల్తీ మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అంతా కల్తీమయమైపోయిందన్నారు. కల్తీ పాల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితుల్లో కొందరు రెండు కిడ్నీలూ పాడై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని, మరి కొందరు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాలో రసాయనాలు కలిపి, కల్తీ పాలు తయారు చేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడం, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాల ప్యాకెట్ల వినియోగం భారీగా పెరిగిందని, ఇటువంటి పరిస్థితుల్లో నాణ్యతా పరీక్షలు చేయకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యతని తెలిపారు. కల్తీ పాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి డైరీలో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించి, సురక్షితమైతేనే ప్రజలకు సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.


