చోరీల్లో కిలేడీ
అమలాపురం టౌన్: ఆ కి‘లేడీ’ చోరీలకు మహిళా ప్రయాణికులే టార్గెట్.. ఆటోలు, బస్సుల్లో వెళ్తూ తోటి ప్రయాణికులతో మాటలు కలిపి బంగారు నగలు, నగదు ఉన్న బ్యాగ్లను అవలీలగా తస్కరిస్తుంది. తాజాగా అమలాపురం పట్టణం, తాలూకా (రూరల్) పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ తరహా చోరీలకు పాల్పడింది. ఎట్టకేలకు అమలాపురం పోలీసులకు చిక్కింది. దీనిపై సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్తో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఇటీవల అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి గోఖిలే సెంటర్కు తాటికొండ సత్యదేవి ఆటోలో వెళ్తుండగా, ఆమె బంగారు నగల హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, గోకవరం గ్రామ శివారు డ్రైవర్స్ కాలనీకి చెందిన బండి శివపార్వతిని అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. పట్టణంలో ఇదే మహిళ మరో చోరీతో పాటు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో చోరీ చేసింది. ఈ మూడు చోరీలకు సంబంధించి శివ పార్వతిని అరెస్ట్ చేసి, రూ.20.50 లక్షల విలువైన 141.350 గ్రాముల బంగారు నగలు, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసాద్, సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, క్రైం ఎస్సై పరదేశి, ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుళ్లు శ్రీను, అర్జున్, హరి, సాయి, శుభాకర్, ప్రసాద్, నాగరాజులను ఎీస్పీ మీనా ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా వారికి నగదు రివార్డులు అందజేశారు.
మరో కేసులో బంగారం రికవరీ
అమలాపురంలో ఆదివారం రాత్రి ఉప్పలగుప్తానికి చెందిన పెయ్యల శాంతి ఆటోలో వస్తూ పోగొట్టుకున్న రూ. 4.50 లక్షల విలువైన 4 కాసుల బంగారు నగలను మర్నాడు అంటే సోమవారం సాయంత్రానికి నూరు శాతం అమలాపురం పోలీసులు రికవరీ చేశారు. ఈ బంగారు నగలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు శాంతి కుటుంబీకులకు సోమవారం సాయంత్రం అందించారు.


