శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అంబాజీపేట: రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే కులగణన ద్వారా శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టేలా పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. గంగలకుర్రు అగ్రహారంలో శెట్టిబలిజ సంఘ ఆహ్వాన కమిటీ నాయకులు విత్తనాల ఇంద్రశేఖర్, మట్టపర్తి సతీష్, రాయుడు షణ్ముక్, సంసాని మురళి, దొంగ హరి, మట్టపర్తి విజయ్ తదితరుల పర్యవేక్షణలో శెట్టిబలిజ స్థూపాన్ని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఎంఎం శెట్టి అధ్యక్షతన జరిగిన శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీలకు భయపడి కులగణన చేపట్టాయని, దీంతో పాటు జాతి గణన చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల్లో ఇతర బీసీ కులాలను కలుపుకొని శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టాలన్నారు. శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యభూమిక వహిస్తుందనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శెట్టిబలిజలు రాజ్యాధికారాన్ని శాసించే విధంగా అడుగులు వేయాలన్నారు. అలనాటి నుంచి గంగలకుర్రు అగ్రహారం శాసించే రాజకీయాలకు పేరుగాంచిందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. శెట్టిబలిజలంతా ఐక్యంగా సాగాలన్నారు. నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి భరత్భూషన్, రెడ్డి నాగేంద్రమణి మాట్లాడుతూ శెట్టిబలిజ కులస్తులంతా సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు.
ఆత్మీయ సమ్మేళన సభ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు దొమ్మేటి వెంకటరెడ్డి, రాయుడు సత్తిబాబు చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, సర్పంచ్లు దొంగ నాగేశ్వరరావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, బొంతు పాపయ్య, కుడుపూడి సత్తిబాబు, రాయుడు కృష్ణమహేష్, రాయుడు మీరయ్య, గుత్తుల సాయి, పిల్లి నాగ గోపాలకృష్ణ, వాసంశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.


