డిప్యూటీ స్పీకర్‌ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌ క్షమాపణ చెప్పాలి

Apr 28 2025 12:15 AM | Updated on Apr 28 2025 12:15 AM

డిప్యూటీ స్పీకర్‌ క్షమాపణ చెప్పాలి

డిప్యూటీ స్పీకర్‌ క్షమాపణ చెప్పాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.పవన్‌తో కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై రఘురామ కృష్ణరాజు అధికార మదంతో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని దుయ్యబట్టారు. పాలకోడేరు గ్రామంలో దాదాపు 800 మంది పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన రఘురామ కృష్ణరాజు.. బాధితులను పరామర్శించి, వారికి అన్నం పెట్టి, ఆదుకున్న సీపీఎంపై, పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై బెదిరింపు మాటలు మాట్లాడటం తప్పని అన్నారు. ‘బతికిపోయావు అంటూ బెదిరింపులకు దిగడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో పరిశీలించుకోవాలని హితవు పలికారు. గత ఐదేళ్లూ భయపడి నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలో దాక్కున్న రఘురామ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘మీ ధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని ఎద్దేవా చేశారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి సంపాదించిన సొమ్ముతో విర్రవీగుతూ మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పేదల ఇళ్లు కూలగొట్టడం గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. ‘ఒక ఊళ్లో గుడిసెలు పీకితే తప్ప మరో ఊళ్లో మంచినీళ్లు అందించలేరా? దీనినే అభివృద్ధి, ప్రజా పరిపాలన అంటారా?’ అని అరుణ్‌ ప్రశ్నించారు. కూల్చిన చోటనే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement