
ప్రధానికి షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలి
రాజమహేంద్రవరం సిటీ: జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి ఘటనను రాజకీయం చేయడం ిపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల వెంటనే ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీనిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. ఈ ఘటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే షర్మిలకు తగిన గుణపాఠం చెప్పడానికి మహిళా మోర్చా సిద్ధంగా ఉంటుందని నిర్మలా కిషోర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జిల్లా అధ్యక్షురాలు మద్దిపాటి రజని పాల్గొన్నారు.