‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’ | - | Sakshi
Sakshi News home page

‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’

Apr 19 2025 12:19 AM | Updated on Apr 19 2025 12:19 AM

‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’

‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌):

‘రామాయణాన్ని చదవని వారు, రామతత్త్వాన్ని అర్థం చేసుకోని వారు సీతమ్మను రాముడు పరిత్యజించడాన్ని విమర్శిస్తారు. రాముడు ఎన్నడూ సీతమ్మను శంకించలేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నాలుగో రోజు ప్రవచనాన్ని స్థానిక టి.నగర్‌ హిందూ సమాజంలో శుక్రవారం ఆయన కొనసాగించారు. ‘భర్తృ ధర్మం వేరు, రాజధర్మం వేరు. రాముడు రాజధర్మానికి కట్టుబడిన పాలకుడు. భద్రునితో తనను గురించి ప్రజలు మాట్లాడుకుంటున్న శుభాశుభాలు రెండూ తెలుసుకోవాలని రాముడు స్పష్టం చేశాడు. మన రాముడు సాగరంపై సేతువు నిర్మించి, రావణుని వధించి, దుష్కరమైన పని చేశాడు. కానీ, రావణుని స్పర్శ తగిలిన సీతమ్మను రాముడు ఎలా ఏలుకుంటున్నాడని ప్రజలు అనుకుంటున్నారని భద్రుడు చెబుతాడు. ఆదర్శవంతమైన పాలకుడు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’ అని సామవేదం వివరించారు. ‘ఒక వ్యక్తి కీర్తి ఎంత కాలం ఈ లోకంలో ఉంటుందో, అంత కాలం ఆ వ్యక్తి ఉన్నత లోకాల్లో ఉంటాడు. ప్రతి ఒక్కరూ అపకీర్తి సోకకుండా తమను తాము రక్షించుకోవాలి. లోకాపవాదు అత్యంత బాధాకరమైనది. కానీ లోకాపవాదాన్ని తొలగించుకోవాలి. రాముడు 11 వేల సంవత్సరాలు పరిపాలిస్తే, అప్పటికే 9 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి వారు సీతమ్మ అగ్నిప్రవేశాన్ని నమ్మకపోయి ఉండవచ్చు. అపవాదు పట్ల రాముడు ఎంతగానో దుఃఖించాడు. సీతాపరిత్యాగమే తన కర్తవ్యమన్న నిర్ణయానికి వచ్చాడు. ఎవరో ఒక అనామకుడు చెబితే సీతమ్మను ఆయన పరిత్యజించలేదు. ఈ సందర్భంగా మనకు లవకుశ సినిమా గుర్తు రావచ్చు. ఆ సినిమా ప్రారంభంలోనే పద్మ పురాణాంతర్గతమైన కథను అనుసరించి సినిమాను రూపొందించినట్టు పేర్కొన్నారు. వివిధ కల్పాల్లో రామాయణ గాథ జరిగింది. వైవస్వత మన్వంతరంలోని కథను వాల్మీకి మహర్షి మనకు ప్రసాదించారు. స్థూల ధర్మం వేరు, సూక్ష్మ ధర్మం వేరు’ అని సామవేదం వివరించారు. రాముడు ఎన్నడూ ధర్మమార్గాన్ని వీడలేదని, ఆయన మూర్తీభవించిన ధర్మస్వరూపుడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement