అమలాపురం రూరల్: తమ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న రోడ్డును తక్షణమే నిర్మించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం ప్రజలు, స్థానిక జనసేన, టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గున్నేపల్లి అగ్రహారం పరిధిలోని మామిడితోట నుంచి బుల్లి కాలనీ వరకు ఉన్న రహదారి, డ్రెయిన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్తులు పాదయాత్ర నిర్వహించారు. మామిడి తోట రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేస్తూ ఫ్లెకీలను ప్రదర్శించారు. కనీస అవసరమైన రహదారి కోసం తాము పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మేడిచర్ల ఆదినారాయణ, మేడిచర్ల కృష్ణ, ఆకుల గంగరాజు, వాకపల్లి శ్రీను, కుడిపూడి నాగరాజు, సాపే రాంబాబు, లంక వీరాంజనేయులు, కాండ్రేగుల భాస్కరరావు, చాగంటి గంగభవాని తదితరులు పాల్గొన్నారు.


