సాక్షి, అమలాపురం: ‘ఆడిన మాట తప్పని.. ఇచ్చిన హామీని నెరవేర్చిన’’ పార్టీగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా పండగలా సాగాయి. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు.. గ్రామాలలో ఈ వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. పార్టీ 16వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్లు కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచారు. దివంగత మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు, రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలలో పార్టీ పదవులు, అనుబంధ విభాగాల పదవులు ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొత్తపేట: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. అన్ని మండలాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రావులపాలెంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల సమక్షంలో పార్టీ పతాకాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. కార్యాలయంలో కేకును కట్ చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు, పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు మూసునూరి వెంకటేశ్వరరావు, కర్రి నాగిరెడ్డి పాల్గొన్నారు.
రాజోలు : రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మలికిపురం, రాజోలులో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తాటిపాక, రాజోలు, మలికిపురాల్లో దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్లు కట్ చేసి అభిమానులకు పంచారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం మేరిమాత వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, సీఈసీ సభ్యుడు కె.ఎస్.ఎన్.రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్యకుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నవరాజు పాల్గొన్నారు.
ముమ్మిడివరం : వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన ముమ్మిడివరం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగరవేసి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. పొన్నాడ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో శ్రమ పడుతున్న ప్రతి కార్యకర్తకి, నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ సభ్యురాలు కాశీ బాల మునికుమారి పాల్గొన్నారు.
రామచంద్రపురం : పార్టీ ఆవిర్భావ దినోత్సవం రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని గాంధీపేటలో పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయంలో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీ, మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు.
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం వృద్ధాశ్రమంలో
పండ్లు పంపిణీ చేస్తున్న రాజోలు కో ఆర్డినేటర్ రాజేశ్వరిదేవి తదితరులు
రామచంద్రపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన నేతలు
పండగలా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో వేడుకలు
వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులు
పార్టీ జెండాల ఆవిష్కరణ
పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
పలుచోట్ల సేవా కార్యక్రమాలు


