అమలాపురం రూరల్: ఇరాన్– ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరత ఉండదని జేసీ టీ. నిషాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిధిలోని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం కంపెనీల డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ సరఫరా విధి విధానాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులు నమ్మవద్దని అన్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను చమురు కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయన్నారు. హోటల్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు ఇతర రకాల ఇంధన వనరులను వినియోగించుకోవాలని సూచించారు. మొదటగా గృహ అవసరాలకు రెండో ప్రాధాన్యత గా ఆసుపత్రుల అవసరాలకు గ్యాస్ సరఫరా చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం అంగన్వాడీ కేంద్రాలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే డీఎస్ఓ కార్యాలయంలో 98481 41965 నంబర్లో సంప్రదించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్, ఏ ఎస్ఓ శరత్, డీలర్లు పాల్గొన్నారు.
ఈ – ఫైళ్ల పరిష్కారంలో ప్రథమ స్థానం
ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలో కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జేసీ నిషాంతి పేర్కొన్నారు. ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్స్ పరిష్కారంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్లు జాబితా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ జాబితాల్లో సంయుక్త కలెక్టర్ల కేటగిరిలో తాను ప్రథమ స్థానంలో నిలిచానన్నారు.


