రక్షకుని రాకకు..
సాక్షి, అమలాపురం: కరుణామయుడు అరుదెంచే శుభ తరుణం ఆసన్నమైంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురంతో పాటు వివిధ గ్రామాల్లో చర్చిలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్రీస్తుస్తుతి గీతాలతో పండగ వాతావరణం నెలకొంది. శాంటాక్లాజ్లు, క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల స్టార్లు.. క్రిస్మస్ వేడుకలకు కొత్త అందం తీసుకువచ్చాయి.
సర్వం సిద్ధం
లోక రక్షకుని రాక కోసం ఊరువాడా సిద్ధమవుతోంది. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. కరుణామయుని పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోటా చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో ముస్తాబు చేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలియజేస్తూ పశువుల పాకల సెటింగులు వేశారు. చర్చిల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆరాధన కూడికలు జరుగుతాయి. క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేకంగా స్టార్, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను డిసెంబర్ నెలంతా ప్రత్యేకంగా జరుపుకొంటారనే విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి సుమారు 400కు పైగా చర్చలున్నాయని అంచనా. వీటిలో జిల్లా కేంద్రమైన అమలాపురంలో మన్నా జూబ్లీ చర్చి, లూథరన్, ఆర్సీఎం చర్చిలు పెద్దవి. వీటిలో క్రిస్మస్ సందర్భంగా వేల మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
● మండపేట పట్టణంలో అతి పురాతనమైన రోమన్ కేథలిక్ చర్చి, న్యూలైఫ్ బాప్టిస్ట్, రామచంద్రపురం పట్టణంలోని ఏసు ప్రేమాలయం, రోమన్ కేథలిక్ చర్చిలు, ముమ్మిడివరం ఆర్సీఎం, ఐ.పోలవరం మండలం కొమరిగిరి చర్చి, రాజోలు లూథరన్, పి.గన్నవరం మండలం కందాలపాలెం చర్చిలతో పాటు కొత్తపేట లూథరన్, మన్నా, పలివెల ఆర్సీఎం, వాడపాలెం ప్రవచన దేవుని సంఘం, ఎరుషలేం చర్చిలను అందంగా ముస్తాబు చేశారు.
● పుదుచ్చేరి యానాంలో ఫ్రెంచివారు నిర్మించిన ఆర్ సీఎం చర్చితో పాటు యానాంలో గౌతమీ నదీపాయలో జీసెస్ విగ్రహాలు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇక్కడ విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు దైవారాధనకు వచ్చే క్రీస్తువులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.
● చర్చిలతో పాటు క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద కూడా ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఇళ్ల వద్ద క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు స్టార్లు తగిలించారు. కుటుంబ సభ్యులు, క్రైస్తవ భక్తులకు పంచేందుకు ప్రత్యేక కేక్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన పట్టణాలలో క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి అమ్మకాలతో ఆయా దుకాణాలు సందడిగా మారాయి.
ముస్తాబైన క్రైస్తవ మందిరాలు
నేడు క్రిస్మస్ వేడుకలు
విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న చర్చిలు
ఇళ్ల ముందు కనువిందు చేస్తున్న స్టార్లు
ఊపందుకున్న కేక్లు,
క్రిస్మస్ ట్రీల విక్రయాలు
రక్షకుని రాకకు..
రక్షకుని రాకకు..
రక్షకుని రాకకు..


