
విఘ్నేశ్వరుని సన్నిఽధికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ వంటి విశేష పూజలు జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 17 జంటలు పాలొన్నాయి. స్వామివారికి ఆరుగురు భక్తులు ఉండాళ్ల పూజ జరిపారు. స్వామి సన్నిధిలో 12 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆరుగురు చిన్నారులకు తులాభారం, తొమ్మిది మందికి అన్నప్రాశన నిర్వహించారు. 33 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,180 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,56,461 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.