
ఇంకెనా్నళ్లీ ఎదురుచూపులు
● స్పౌజ్ పింఛన్లపై స్పష్టత ఇవ్వని సర్కార్
● మూడు నెలలుగా
2,823 మంది అవస్థలు
● ఆగస్టులోనైనా పంపిణీ జరిగేనా?
ఆలమూరు: సాధారణంగా పింఛన్ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవడం, వాటిని ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేయడం, జాబితాలో పేరు రాగానే పింఛన్ సొమ్ము లబ్ధిదారులకు అందించడం మనందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తెర మీదకు వచ్చింది. అర్హుల జాబితాలో లబ్ధిదారుడి పేరు కనిపిస్తుంది. కానీ పింఛన్ సొమ్ము రావడం లేదు. స్పౌజ్ పింఛన్ల విషయంలో జరుగుతున్న ఈ తికమకతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్నాళ్లీ ఎదురు చూపులు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పౌజ్ పింఛన్లు అంటే..
పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు మృతి చెందితే, ఆయన భాగస్వామికి ఇచ్చే వాటినే స్పౌజ్ పింఛన్లు అంటారు. అంటే ఇవి కొత్తగా మంజూరు చేసేవి కావు. పాత వాటినే భాగస్వామి పేరు మీదకు మార్చుతారు. అయితే ప్రస్తుతం స్పౌజ్ పింఛన్ వ్యవహారం అయోమయంగా మారింది. చాలామంది వృద్ధ దంపతులు ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో పింఛన్ పొందుతున్న పెద్ద చనిపోతే, వెంటనే ఆయన భార్యకు పింఛన్ మంజూరు చేస్తే చాలా ఆసరాగా ఉంటుంది. అయితే రాష్ట్ర సర్కారు మాత్రం స్పౌజు పింఛన్ల విషయంలో మొద్దు నిద్ర వహిస్తోంది.
నెలలు గడుస్తున్నా..
స్పౌజ్ పింఛన్లకు సంబంధించి అర్హుల జాబితా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో లబ్ధిదారుల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా జనవరి, జూలై నెలల్లో క్రమం తప్పకుండా అర్హులకు కొత్త పింఛన్ మంజూరు చేసేవారు. స్పౌజ్ పింఛన్ అయితే మరుసటి నెలలోనే భార్యకు అందించేవారు.
లబ్ధిదారుల ఆవేదన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్క కొత్త పింఛన్ను మంజూరు చేయక పోగా, స్పౌజ్ పింఛన్ను కూడా సక్రమంగా అందజేయడం లేదు. దీనిపై ఇటీవల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2024 నవంబర్ నుంచి స్పౌజ్ పింఛన్ను అమలు చేశారు. అయితే అంతకు ముందు స్పౌజుకు ఎంపికై న లబ్ధిదారులకు ఇంకా పింఛన్ మంజూరు కాలేదు. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకూ జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో 3,625 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో వివిధ కారణాల రీత్యా 802 పింఛన్లు తిరస్కరించబడగా, 2,823 మంది అర్హత సాధించారు. ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ గురించి ఏ విధమైన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వితంతు మహిళలకు ప్రతి నెలా నిరాశ ఎదురవుతోంది. దీనిపై గ్రామ సచివాయాలకు వెళ్లి ఆరా తీస్తున్నా తమకేమీ తెలియదని అధికారులు, సిబ్బంది చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
జాబితా ప్రదర్శన
స్పౌజ్ పింఛన్కు అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జిల్లాలోని ఆయా గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచించారు. అనంతరం ఈ ఏడాది జూన్ 12న స్పౌజ్ పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచే తమకు పింఛన్ సొమ్ము అందుతుందని లబ్ధిదారులు ఆనంద పడ్డారు. కూటమి నాయకులు కూడా ఈ విషయంపై ఊరూవాడా ప్రచారం చేశారు. కానీ జూన్లో పింఛన్లు పంపిణీ చేయలేదు. దీనిపై లబ్ధిదారులు మళ్లీ కూటమి నాయకులు, అధికారులను ప్రశ్నించగా జూలైలో రెండు నెలల పింఛన్ను కలిపి అందజేస్తామని తెలిపారు. ఆ నెలలో కూడా షరా మామూలుగానే పింఛన్ను పంపిణీ చేయలేదు. మళ్లీ ఆగస్టు నెల వచ్చేసింది. ఈ సారైనా పింఛన్ ఇస్తారేమోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడైనా ఇస్తారా?
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే స్పౌజ్ పింఛన్ల పంపిణీ ఆగస్టులో కూడా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందేమో అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే కూటమి నేతలు ఈ విషయంపై నోరెత్తకపోవడం మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ పింఛన్ మంజూరులో ప్రభుత్వానికి ఎటువంటి భారం పడదు. పాత వాటినే భాగస్వామికి అందజేస్తారు. కానీ ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.