రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం | Two Constables Died In Road Accident In Telangana Siddipet, More Details Inside | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం

Dec 9 2024 6:16 AM | Updated on Dec 9 2024 9:36 AM

Two constables die in road accident: Telangana

మారథాన్‌కు బైక్‌పై వెళుతుండగా ఢీకొట్టిన బొలేరో వాహనం

గజ్వేల్‌ బైపాస్‌రోడ్డులో ఘటన

గజ్వేల్‌రూరల్‌: మారథాన్‌ పోటీలో పాల్గొనేందుకు వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో చోటుచేసుకుంది. హిట్‌ అండ్‌ రన్‌ ఘటనతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్‌ పరంధాములు(46) రాయపోల్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, గాడిచర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్‌(38) దౌల్తాబాద్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు హైదరాబాద్‌లోని ఈసీఎల్‌ ప్రాంతంలో మారథాన్‌(రన్‌) కార్యక్రమం ఉండడంతో వీరు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఈ క్రమంలో పట్టణంలోని జాలిగామ బైపాస్‌ రోడ్డు మార్గంలో రాంగ్‌రూట్లో వెళుతుండగా, ఇదే సమయంలో గజ్వేల్‌ నుంచి దౌల్తాబాద్‌ వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్లు ధరించినా, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.  

మరణంలోనూ వీడని స్నేహం: మరణంలోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. పరంధాములుది 2004 బ్యాచ్‌ కాగా, వెంకటేష్‌ 2007 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. ఎక్కడ మారథాన్‌ పోటీలు జరిగినా పోలీస్‌శాఖ తరపున వెళ్లి పాల్గొనే వారని తోటి పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో మారథాన్‌ పోటీల్లో పాల్గొనేవారు ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సభ్యులుగా ఉన్న వెంకటే‹Ù, పరంధాముల మధ్య స్నేహం ఏర్పడింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు ముంబయి, న్యూఢిల్లీలో సైతం జరిగిన మారథాన్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement