అఫ్గాన్ దాడుల్లో 17 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ వరుస దాడులతో దద్దరిల్లింది. వేర్వేరు సంఘటనల్లో దేశంలో దాదాపు 17మంది మరణించారు. తాలిబన్లకు, అధికారపక్షానికి మధ్య చర్చలు జరగాల్సిన తరుణంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. మంగళవారం ఉత్తర బాల్క్ ప్రావిన్స్లో ట్రక్ సూసైడ్ బాంబర్ దాడిలో ఇద్దరు అఫ్గాన్ కమాండోలు, ఒక పౌరుడు మరణించారు. మరో ఆరుగురు కమాండోలు, 35మంది పౌరులు గాయపడ్డారు. డజనుకుపైగా గృహాలు దెబ్బతిన్నాయి.
ఈ దాడికి తామే కారణమని తాలిబన్ ప్రతినిధి జబుల్లా ముజాహిత్ ప్రకటించారు. బాల్క్లోనే మరో ఘటనలో ఒక గన్మెన్ ఐదుగురిని కాల్చిచంపాడు. ఘోర్ ప్రావిన్స్లోని చెక్పాయింట్ వద్ద జరిగిన మరోదాడిలో 8మంది సైనికులు మరణించగా, 5గురు గాయపడ్డారు. రాజధాని కాబూల్లో జరిగిన బాంబుదాడిలో ఒక పోలీసు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరోపక్క అఫ్ఘాన్ ఆర్మీ జరిపిన వైమానిక, సైనిక దాడుల్లో 91మంది తాలిబన్లు మరణించారని సోమవారం ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. మరో 50 మంది తాలిబన్లు గాయపడ్డట్లు తెలిపాయి.