Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు  | Powder Manufacturing Factory Siege with Animal Bones at Achampet | Sakshi
Sakshi News home page

Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు 

Jan 11 2022 7:55 PM | Updated on Jan 11 2022 8:07 PM

Powder Manufacturing Factory Siege with Animal Bones at Achampet - Sakshi

నిర్వాహకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌  

సాక్షి, మహబూబ్‌నగర్‌(అచ్చంపేట రూరల్‌): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్‌ ఫ్యాక్టరీని అధికారులు సీజ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్‌ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు.

చదవండి: (సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ)

నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు. అలాగే విద్యుత్‌ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్‌ను ఆర్గానిక్‌ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్‌ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.  

చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య)

Advertisement
 
Advertisement
Advertisement