
సాక్షి,దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట రూ.60 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు తెప్పించారు.
వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయంతో శనివారం సాయంత్రం గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న ధర్మరాజు, అతని స్నేహితులు కాకినాడకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్ అలియాస్ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరాజు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్ కలిసి రామారావు నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోటార్ సైకిల్పై ఉడాయించారు.
వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని రూ.60 లక్షలు రికవరీ చేశారు. ఈ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులెవరు, ఎంతమందిని మోసం చేశారనే విషయాలపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే తరహాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ