అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | Interstate gang arrested by Chittoor District Police | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Oct 17 2021 4:45 AM | Updated on Oct 17 2021 4:45 AM

Interstate gang arrested by Chittoor District Police - Sakshi

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు చూపుతున్న పుత్తూరు డీఎస్పీ యశ్వంత్, ఇతర సిబ్బంది

పుత్తూరు రూరల్‌(చిత్తూరు జిల్లా): అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 లక్షలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ టీడీ యశ్వంత్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. పుత్తూరు డివిజన్‌ పరిధిలోని దొంగతనాలను అరికట్టేందుకు, నిందితులను పట్టుకునేందుకు నెల రోజులుగా 30 మందితో కూడిన 4 బృందాలు తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో విసృతంగా గాలించాయని చెప్పారు.

ఈ నెల 14న నారాయణవనం మండలం పాలమంగళం బస్టాప్‌ వద్ద పుత్తూరు రూరల్‌ సీఐ, నారాయణవనం, ఎస్‌ఆర్‌పురం, వరదయ్యపాళెం ఎస్‌ఐలతో కూడిన బృందం తమిళనాడుకు చెందిన నలుగురు గజ దొంగలను పట్టుకుందని చెప్పారు. వీరిలో రాయపురానికి చెందిన ఆర్‌.రవి అలియాస్‌ రవిశంకర్‌.. ప్రస్తుతం ఏపీలోని పిచ్చాటూరు మండలం కొత్తగొల్లకండ్రిగలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మిగిలిన ముగ్గురు కె.భాస్కర్, ఎ.మణి, ఎం.సేతు ధర్మపురం జిల్లా ఆరూరుకు చెందిన వారని పేర్కొన్నారు.

వీరిని విచారించగా సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, పుత్తూరు, ఎస్‌ఆర్‌ పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేశామని అంగీకరించినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించిన పుత్తూరు, నగరి రూరల్‌ సీఐలు ఎం.సురేష్‌కుమార్, ఎం.రాజశేఖర్, సీఐ చంద్రశేఖర్‌నాయక్, ఎస్‌ఐలు ఎం.ప్రియాంక, ఎన్‌.శ్రీకాంత్‌రెడ్డి, ఎం.నాగార్జునరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఇతర సిబ్బందిని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ అభినందించారని డీఎస్పీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement