Gachibowli: ప్రేమోన్మాది ఘాతుకం: యువతి గొంతు కోసిన యువకుడు

Hyderabad Man Stabs Woman For Rejecting His Proposal In Gachibowli - Sakshi

తిరస్కరించినందుకు దాడి

అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి ప్రవేశించి.. 

యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

మెడ, చేతివేళ్లు, మణికట్టు, కాలిపై గాయాలు

చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు

చికిత్స పొందుతున్న యువతి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ప్రేమ వద్దంటూ యువతి నిరాకరించింది.. దీంతో కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా యువతిని చంపేయాలని యువకుడు నిశ్చయించుకున్నాడు. కత్తితో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఈ ఘటన వట్టినాగులపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గచ్చబౌలి ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ వివరాలను వెల్లడించారు.

వట్టినాగులపల్లిలో నివసించే తుల్జాబాయి, గణేష్‌సింగ్‌ దంపతులకు హనుమాన్‌సింగ్, రూఖీసింగ్‌(21) ఇద్దరు సంతానం. రూఖీసింగ్‌ మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో బీఆర్క్‌ నాల్గో సంవత్సరం చదువుతోంది. కేపీహెచ్‌బీలోని ఎంఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ప్రేమ్‌సింగ్‌ (21) రూఖీసింగ్‌కు రెండుసార్లు తెలిసిన వారి శుభకార్యాల్లో కనిపించింది. అన్నా అంటూ పలకరించింది. దాంతో అప్పటి నుంచి ఆమె వెంట పడటం మొదలు పెట్టాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు.
చదవండి: వామ్మో! గుండె గుబేలు.. కరెంటు బిల్లు రూ.లక్షా 21వేలు

ఎప్పటిలాగే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో హనుమాన్‌సింగ్‌కు కిడ్నీలో నొప్పి రావడంతో లింగంపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్‌ ఇప్పించి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఎవరి గదిలో వారు నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఇంట్లో అలజడి కావడంతో వారికి మెలకువ వచ్చింది. చెల్లి గదిలో అలజడి అయినట్లు హనుమాన్‌ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలిసి రూమ్‌ తలుపులను గట్టిగా తోయడంతో తలుపులు తెరుచుకున్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడ, ఎడమచేతి వేళ్లకు, ఎడమకాలిపై గాయాలయ్యాయి.

ఎదురుగా ఉండే బంధువులతో కలిసి కారులో ఆమెను కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన ప్రేమ్‌సింగ్‌ను ఇంట్లోనే బంధించి చితకబాదారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా వారు అతడిని కొండాపూర్‌  ఆస్పత్రికి తరలించారు. 

నిందితుడిని ఉరితీయాలి 
తమ కూతురిపై కత్తితో దాడి చేసిన నిందితుడు ప్రేమ్‌సింగ్‌ను ఉరి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడి రెండు కత్తులతో దాడి చేశాడన్నారు. అలజడితో మేల్కొన్నామని, తలుపులు పగులగొట్టి అతడిని పట్టుకున్నామన్నారు. తమ కూతురికి తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స పొందుతోందన్నారు.
చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్‌.. అంతలోనే.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top