ఒక దొంగ... తొమ్మిది వారెంట్లు! | Hyderabad: Man with nine non-bailable warrants arrested | Sakshi
Sakshi News home page

ఒక దొంగ... తొమ్మిది వారెంట్లు!

Dec 10 2024 8:03 AM | Updated on Dec 10 2024 12:29 PM

Hyderabad: Man with nine non-bailable warrants arrested

మూడున్నరేళ్లుగా పరారీలో ఉన్న ప్రదీప్‌  

రాజస్థాన్‌లో పట్టుకున్న సైబరాబాద్‌ సీసీఎస్‌  

సాక్షి, హైదరాబాద్‌: సొత్తు సంబంధిత నేరాల్లో నిందితుడిగా ఉండి మూడున్నర ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న రాజస్థాన్‌ వాసి ప్రదీప్‌ను సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతగాడిపై మూడు పోలీసుస్టేషన్ల పరి«ధిలో తొమ్మిది నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నట్లు క్రైమ్స్‌ డీసీపీ కె.నర్సింహ్మ సోమవారం తెలిపారు. రాజస్థాన్‌లోని బిచౌలా గ్రామానికి చెందిన ప్రదీప్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నిర్మాణరంగంలో కార్మికుడిగా పని చేసిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం దొంగగా మారాడు. 

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, నిర్మాణ స్థలాలను టార్గెట్‌గా చేసుకున్న ఇతగాడు వాటి నుంచి ఇనుము, అల్యూమినియం తదితర వస్తువులు చోరీ చేసి అమ్మేవాడు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇతడిపై కొల్లూరు, మోకిలా, నార్సింగి పోలీసుస్టేషన్ల పరిధిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఓ సందర్భంలో మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021లో ఇతగాడిని కొల్లూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రదీప్‌ తన స్వస్థలానికి వెళ్లిపోయారు. ఈ తొమ్మిది కేసుల్లోనూ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానాలు ఎన్‌బీడబ్ల్యూలు జారీ చేశాయి. 

మూడున్నరేళ్లుగా ఇతగాడి ఆచూకీ ఎవరికీ లభించలేదు. దీంతో ప్రదీప్‌ అరెస్టు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ సీసీఎస్‌ అధికాలు రాజస్థాన్‌కు పంపారు. ముమ్మరంగా గాలించిన పోలీసులు శనివారం రాజస్థాన్‌లో పట్టుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తీసుకువచ్చారు. కొల్లూరు పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఎనిమిది కేసుల్లోనూ ఇతడిని అరెస్టు చూపించనున్నారు.

నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు


 

 

Advertisement
 
Advertisement
Advertisement