Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది. కీచకుడిగా మారిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గత ఏప్రిల్లో ఓ వార్డు బాయ్ నర్సుపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే మరో కామాంధుడి లీలలు వెలుగు చూశాయి. ఆసుపత్రిలోని మొదటి ఫ్లోర్లో గల ఆసుపత్రి అనుబంధ విభాగంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి గత కొద్ది నెలలుగా మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని లోబర్చుకునేందుకు వెకిలి చేష్టలతో వేధిస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల హద్దులు దాటి లైంగిక వేధింపులకు గురిచేయడంతో సహనం కోల్పోయిన బాధితులు దీటుగానే ఎదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా తూతూమంత్రంగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ప్రధాన ఆసుపత్రి నుంచి ఎంసీహెచ్కు స్థాన చలనం కల్పించగా అక్కడా విధులు నిర్వహించకుండా తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పి, విధులకు ఎగనామం పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
కీచకుడిగా మారిన సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానచలనం కల్పించి, చేతులు దులుపుకోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచకుడిని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయమై బాధితులు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించినట్లు, హెచ్ఆర్సీ బాధ్యులు నాలుగు రో జుల క్రితం ఆసుపత్రికి వచ్చినట్లు తెలిసింది.
చదవండి: దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య