మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని.. | Sakshi
Sakshi News home page

మూడో భర్తతో గొడవ.. రెండో భర్త బిడ్డను తలగబెట్టిన తల్లి.. పతివ్రతనే అని..

Published Tue, Feb 1 2022 8:43 AM

Extramarital affair: Mother Brutally Killed Her Daughter In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): తనను అనుమానించిన మూడో భర్త ముందు తాను పతివ్రతనే అని నిరూపించుకునేందుకు ఓ తల్లి కసాయిగా మారింది. తన రెండో భర్తకు పుట్టిన ఆడబిడ్డను కడతేర్చింది. చెన్నైలో ఆదివారం రాత్రి  చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాలు.. తూత్తుకూడికి చెందిన పాల్‌ వణ్ణన్‌ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది.

కొన్నాళ్ల అనంతరం భర్త, కుమార్తెను వదిలిపెట్టి మరిది దురైరాజ్‌తో జయలక్ష్మి ముంబైకు పారిపోయింది. అక్కడ పెళ్లి చేసుకున్న వీరికి పవిత్ర(10) కుమార్తె ఉంది. ఏడేళ్ల క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దురైరాజ్‌ పత్తాలేకుండా పోయాడు. తర్వాత కొద్ది రోజులు ముంబైలో ఉన్న జయలక్ష్మి కుమార్తె పవిత్రతో కలిసి చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడ ఓ లారీడ్రైవర్‌ను మూడో వివాహం చేసుకుంది.

వీరికి కుమార్తె భానుప్రియ(06), కుమారుడు భూపాలన్‌(05) ఉన్నారు. కాగా ఇటీవల మూడో భర్త పద్మనాభన్‌ జయలక్ష్మిపై అనుమానంతో గొడవపడే వాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి, అతడి ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్‌కు పుట్టిన పవిత్రపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టింది. తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రతిజ్ఞ చేసింది. ఆతర్వాత కాసేపటికి మేల్కొన్న ఈ కసాయి తల్లి మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది.

స్థానికులతో కలసి  కీల్పాకం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో జయలక్ష్మి మూడు పెళ్లిల భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను అరెస్టు చేశారు. కాగా వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు. 

భార్యను హత్య చేసిన భర్త 
తిరువొత్తియూరుః ఇంటిని తన పేర రాసి ఇవ్వమంటూ గొడవ చేయడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యాడు. వివరాలు.. చెన్నై తండయార్‌ పేటకు చెందిన దళపతి (52). ఇతను నౌకలోపని చేస్తూ ఉన్నాడు. అతని భార్య షణ్ముఖప్రియ (49). వీరి కుమారుడు ఇలంపరిధి (28). విదేశాల్లో నౌకలో పని చేస్తూ ఉన్నాడు. మరో కుమారుడు అరుణ్‌ (26) ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కుమార్తె అనిత (26)కు వివాహమై భర్తతో నివాసం ఉంటుంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి దళపతి, షణ్ముఖ ప్రియా మధ్య గొడవ ఏర్పడింది. ఆ సమయంలో షణ్ముఖ ప్రియా భర్త పేరులో ఉన్న ఇంటిని తనకు రాసివ్వాలని కోరింది. ఆగ్రహం చెందిన దళపతి వంట గదిలో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన షణ్ముఖప్రియను ఇరుగుపొరుగువారు  ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు దళపతి పోలీస్‌ స్టేషన్లో సరెండర్‌ అయ్యారు.  

Advertisement
Advertisement