డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student Committed Suicide For Financial Issues In Hyderabad - Sakshi

సాక్షి, నాగోలు: తండ్రి పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన యర్రమాద సదానంద్‌ టైలర్‌గా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా చిట్యాలలో పనిలేక పోవడంతో భార్య సంధ్య, కుమారుడు శివప్రసాద్‌ (24)కుమార్తె స్వాతిలతో కలసి సదానంద్‌ నగరానికి వచ్చాడు. ఎల్‌బీనగర్‌ కాకతీయనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ  స్థానికంగా ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. అతని కుమారుడు సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌  చదువుతున్నాడు.

సదానంద్‌ ప్లంబర్‌గా పని చేస్తున్నా ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న కుమారుడు గత కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నా డు. ఆదివారం మధ్యాహ్నం అతడి తల్లి సంధ్య, సోదరి స్వాతి బయటకు వెళ్లిన సమయంలో శివప్రసాద్‌ ఇంట్లోని సీలింగ్‌ రాడుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తీసి చూడగా  అప్పటికే అతడు మృతి చెందాడు. ఆర్థిక సమస్యలతోనే కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సదానందం ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ఉస్మానియా హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top