చనిపోయిన పినతల్లి చెక్కుల ఫోర్జరీ

Check Forgery Case In Madanapalle - Sakshi

సంతకాలు తారుమారు చేసి డబ్బులు డ్రా

సస్పెండెడ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణ, ఆయన తనయుడు అరెస్టు  

మదనపల్లె టౌన్‌: చనిపోయిన పినతల్లి చెక్కులపై సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్న సస్పెండెడ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణ, ఆయన తనయుడు వంశీకృష్ణను మదనపల్లె టూటౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. బి.కొత్తకోటకు చెందిన సస్పెండెడ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణకు పినతల్లి అయిన సుచరిత గతేడాది మరణించారు.

అయితే ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్‌ చెక్కులను ఫోర్జరీ సంతకాలతో రామకృష్ణ, వంశీకృష్ణలు డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గుర్తించిన సుచరిత కుటుంబసభ్యులు బి.కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ను విచారించగా.. ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసింది వాస్తవమేనని తేలింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హార్సిలీహిల్స్‌ వద్ద ఉన్న రామకృష్ణ, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరుపరచగా 24 వరకు రిమాండ్‌ విధించారని డీఎస్పీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top