విడాకులు ఇవ్వడం లేదనే.. | Boynpally murder case mystery revealed police | Sakshi
Sakshi News home page

విడాకులు ఇవ్వడం లేదనే..

Dec 24 2024 8:38 AM | Updated on Dec 24 2024 8:38 AM

Boynpally murder case mystery revealed police

బోయిన్‌పల్లి యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ 

ఐదుగురు నిందితుల అరెస్టు  పరారీలో మరొకరు  

కంటోన్మెంట్‌: విడాకులు ఇవ్వడం లేదన్న కారణంతోనే బోయిన్‌పల్లికి చెందిన యువకుడు సమీర్‌ను అతడి భార్య కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు. 

ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సోమవారం బోయిన్‌పల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్‌ వివరాలు వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన సమీర్‌ అనే యువకుడు గత జనవరిలో నాచారం ప్రాంతానికి చెందిన ఫిర్దోస్‌ సదాఫ్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నచ్చని అమ్మాయి తండ్రి, ఆమె బంధువులు సాంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేస్తామని ఆమెకు నచ్చజెప్పి పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సమీర్‌తో పెళ్లి రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఆమె తన భర్త సమీర్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. 

దీనిని జీర్ణించుకోలేని సదాఫ్‌ తండ్రి తన బంధువులతో కలిసి సమీర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా శనివారం ఇద్దరు రౌడీషీటర్లుతో కలిసి సమీర్‌ ఇంటికి వచి్చన సదాఫ్‌ కుటుంబ సభ్యులు అతడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సదాఫ్‌ తండ్రి మహ్మద్‌ షబ్బీర్‌ అహ్మద్‌తో పాటు మహ్మద్‌ ఓబర్,  అబ్దుల్‌ మతీన్, సయ్యద్‌ సోహయిల్, షేక్‌ అబు బాకర్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు అబ్దుల్‌ మతీన్, సయ్యద్‌ సోహయిల్‌లపై రౌడీష్‌ట్‌లు ఉన్నట్లు డీసీపీ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement