కోరలు చాచిన అవినీతిపరులు.. ‘తాళిబొట్టు’ ఘటన మరువక ముందే.. | Acb Raids On Forest Office In Mahabubnagar | Sakshi
Sakshi News home page

దొరికితే దొంగ.. లేదంటే దొర 

Jul 2 2021 9:51 AM | Updated on Jul 2 2021 10:13 AM

Acb Raids On Forest Office In Mahabubnagar - Sakshi

ఏసీబీ దాడులతో రద్దీగా మారిన జిల్లా ఫారెస్టు అధికారి కార్యాలయ ఆవరణ (ఫైల్‌)

సాక్షి, వనపర్తి(మహబూబ్‌నగర్‌): లంచగొండితనం రోజురోజుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో కోరలు చాస్తోంది. బుధవారం గద్వాల, వనపర్తి జిల్లాల ఇన్‌చార్జ్‌ ఫారెస్ట్‌ అధికారి అవినీతి భాగోతాన్ని ఏసీబీ (అవినీతి నిరోధకశాఖ) అధికారులు బట్టబయలు చేశారు. ఈ సంఘటన మిగతా జిల్లాల అధికారుల్ని ఉలిక్కిపడేలా చేసింది. రూ.13 లక్షల బిల్లు పాస్‌ చేసేందుకు ఏకంగా రూ.3 లక్షల లంచం అడగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ ఎంత మేర అవినీతి చేశాడో.. ఇంకా ఏసీబీ దృష్టికి రాని, చిక్కని అవినీతి జలగలు చాలానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో చైతన్యం రానంత వరకు లంచాన్ని రూపమాపడం అసాధ్యమే. ఏసీబీ అధికారులు సైతం ఎలాంటి ఫిర్యాదులు లేకుంటే దాడులు చేసే పరిస్థితి లేదనేది ప్రజలు గమనించాలి.

వనపర్తి జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రోజునే.. సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన ఓ మహిళ తన పొలం పట్టా చేసేందుకు అధికారులు అడిగిన లంచం ఇవ్వటానికి తన వద్ద డబ్బు లేవని తాళిబొట్టును తహసీల్దార్‌ కార్యాలయం గుమ్మానికి వేలాడదీసి అక్కడే బైఠాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులోకి రానివి రోజూ చాలానే ఉంటున్నాయనేది జగమెరిగిన సత్యం. చాలా ప్రభుత్వ శాఖల్లో పర్సెంటీజీలు లేనిదే పనికాదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అధికారులతో కలిసి వాటాలేసుకొని పంచుకొంటున్న సంఘటనలు ఇటీవలే జిల్లాకేంద్రంలోని నమ్మచెరువు, మున్సిపాల్టీకి ఇచ్చిన పార్క్‌ స్థలం విక్రయం లాంటివి వెలుగుచూసిన విషయం తెలిసిందే. 

టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయండి 
లంచం ఇవ్వాలంటూ మిమ్మల్ని అధికారులు వేధిస్తే ప్రభుత్వం కల్పించిన టోల్‌ఫ్రీ నంబర్‌కు 1064కు కాల్‌ చేయండి. మీకు ఏసీబీ అండగా ఉంటుంది. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం రావాలి. 
– కృష్ణాగౌడ్, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్‌నగర్‌  

చదవండి: ట్యాపింగ్‌ వట్టిదేనా?  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement