అమ్మా నాన్న.. సారీ

21 Year Old Girl Takes Her Life In Chittoor - Sakshi

మనోవేదనతో యువతి ఆత్మహత్య

‘నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కోసం నేను ఏమీ చేయలేక పోయాను, మిమ్మల్ని ఎప్పుడూ సంతోష పెట్టలేక పోయాను. ఓ మంచి కూతురులా ఉండలేక పోయాను. సారీ అమ్మా, నాన్న’అంటూ మనోవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

సాక్షి, తిరుపతి క్రైం: తిరుపతి నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన గంగమ్మ, గంగాధర్‌ కుమార్తె దేశమ్మ (21) వలంటీర్‌గా పని చేస్తోంది. గ్రూప్స్‌ రాసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటి వచ్చింది. తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్న దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వారు రోజూ లాగే చదువుకుంటోందని భావించారు. ఎంత సేపటికీ తలుపు తెరవకపోవడంతో బలవంతంగా తలుపులు తెరవగా దూలానికి వేలాడుతూ కనిపించింది. చేతిలో సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టుకుంది. ‘నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కోసం నేను ఏమీ చేయలేక పోయాను, మిమ్మల్ని ఎప్పుడూ సంతోష పెట్టలేక పోయాను. ఓ మంచి కూతురిలా ఉండలేక పోయాను. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు’అని రాసి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

వ్యక్తి ఆత్మహత్య 
పీలేరు రూరల్‌ : మండలంలోని రేగళ్లులో మంగళవారం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ తిప్పేస్వామి వివరాల మేరకు.. పాకాల మండలం అయ్యవారి పల్లె పంచాయతీ అనూరోళ్లపల్లెకు చెందిన ఇ.చిన్నబ్బ (50) మంగళవారం రేగళ్లు–సదుం రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పురుగుల మందు తాగి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. (చదవండి: నాన్నా.. కొడుతున్నాడు! : అదే చివరి మాట)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top