ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. | 2 Died In Road Accident at Narapally, Medipally Mandal | Sakshi
Sakshi News home page

Road Accident: ఊరికి వెళ్తుండగా విషాదం

Oct 9 2021 10:41 AM | Updated on Oct 9 2021 10:55 AM

@ Died In Road Accident at Narapally, Medipally Mandal - Sakshi

సోమయ్య, కృష్ణ (ఫైల్‌) 

సాక్షి, ఉప్పల్‌: వరంగల్‌ జాతీయ రహదారి పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో..పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు బైకుపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాగాపురానికి చెందిన మానుపాటి సోమయ్య (70) పండుగ సెలవుల నేపథ్యంలో తన చిన్నకుమారుడు కృష్ణ, మనవడు వినేష్‌తో కలిసి శుక్రవారం ఉదయం బైకుపై కూకట్‌పల్లి నుంచి స్వగ్రామం రాగాపురానికి బయలుదేరారు.

వీరు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నారపల్లికి చేరుకోగానే వరంగల్‌ వైపు నుండి మేడిపల్లి వైపు వస్తున్న కారు ఒక బస్సును ఓవర్‌టేక్‌ చేస్తూ డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతల నుండి వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సోమయ్య, కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా వినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చౌదరిగూడ ప్రాంతానికి చెందిన విక్రాంత్‌రెడ్డి (20) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమయ్య కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement