breaking news
Narapally
-
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యేది అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: దారి పొడవునా గుంతలు.. ఎగసిపడే దుమ్ముధూళి.. దానికి తోడు ట్రాఫిక్.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ రూట్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో పోటాపోటీగా పోస్టర్లతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తడం.. జనాల ఫ్రస్టేషన్ తారా స్థాయికి చేరి సోషల్ మీడియాలోనూ అసహనం వెల్లగక్కడం చూశాం. అయితే అది ఎప్పటికి పూర్తవుతుందనేదానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు స్పష్టత ఇచ్చారు. ‘‘ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలు పెట్టాం. 5.5 కి.మీ గాను 1.5కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైంది. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం. ఉప్పల్ వరంగల్ మార్గంలో మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. రోడ్డు పనులు,ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.2026 దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేసి తీరుతాం. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదు’’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశారు. అదే ఏడాది జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నత్తనడకన సాగాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అనడంతో ఆ రూట్లో ప్రయాణించేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ రోడ్లకు రిపేర్తో పాటు ఫ్లైఓవర్ పనులూ చకచకా జరుగుతున్నాయి. ఈ కారిడార్లో NHAI (National Highways Authority of India) ప్రధాన నిర్మాణ బాధ్యత చేపట్టగా.. GHMC అదనంగా 200 మీటర్ల పొడిగింపు పనులు చూస్తోంది. -
ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..
సాక్షి, ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడిపి డివైడర్ను ఢీకొట్టడంతో..పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు బైకుపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాగాపురానికి చెందిన మానుపాటి సోమయ్య (70) పండుగ సెలవుల నేపథ్యంలో తన చిన్నకుమారుడు కృష్ణ, మనవడు వినేష్తో కలిసి శుక్రవారం ఉదయం బైకుపై కూకట్పల్లి నుంచి స్వగ్రామం రాగాపురానికి బయలుదేరారు. వీరు మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని నారపల్లికి చేరుకోగానే వరంగల్ వైపు నుండి మేడిపల్లి వైపు వస్తున్న కారు ఒక బస్సును ఓవర్టేక్ చేస్తూ డివైడర్ను ఢీకొని రోడ్డు అవతల నుండి వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సోమయ్య, కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా వినేష్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చౌదరిగూడ ప్రాంతానికి చెందిన విక్రాంత్రెడ్డి (20) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమయ్య కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మలి సంధ్యలో మతాబుల వెలుగులు
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వృద్ధులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ‘వి ఫర్ ఆర్ఫాన్’ సంస్థ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనై వృద్ధాశ్రమంలో అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న దీనుల కళ్లలో కాంతులు నింపింది. ఉప్పల్ సమీపం నారపల్లిలో ఉన్న లహరి వృద్ధాశ్రమంలో శనివారం వి ఫర్ ఆర్ఫాన్ సభ్యులు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, అనాథ పిల్లలతో దీపావళి పండుగ జరిపించి వారి మోముల్లో చిరునవ్వులు పూయించారు. అంతేకాదు 25 మంది వృద్ధులకు కొత్త బట్టలు అందించారు. స్వయంగా వృద్ధులకు మిఠాయిలు తినిపించి, వారి చేత దీపావళి బాణసంచా కాల్పించి సంతోషాలు పంచారు. తమకెంతో ఇష్టమైన బిర్యానీని కూడా స్వయంగా తినిపించి సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయత చూపడంతో వృద్ధులు కరిగిపోయారు. అందరూ ఉన్న అనాథల్లా గడుపుతున్న తమకు పండుగ ఆనందాన్ని పంచిన వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంబీసీ డీఎస్టీ నవనిర్మాణ సమితి రాష్ట్ర కన్వీనర్ బెల్లాపు దుర్గారావు అతిథిగా హాజరయ్యారు. చేర్యాల రాకేశ్, చేర్యాల విద్య, యోగిత, ఛార్మ్స్ సంపత్, హరీశ్, మాట్రిక్స్ రమేశ్, బేగంపేట రాజు, సుశీల్, ముకేశ్, కిరణ్, జైహింద్, చందుభాయ్, దుర్గాప్రసాద్, సింగిరాల శ్రవణ్కుమార్, నర్సింగ్, దొప్పల నరేశ్ తదితరులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం నర్లపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన బుధవారం వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.


