కార్వేటినగరం: రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎం అయిన వెంటనే విజయసాయిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా నియమించారన్నారు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి ఒక హిందూయేతర మతానికి ప్రాధాన్యం ఇచ్చారనడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటివి జరగలేదని స్పష్టం చేశారు.
జీడీ నెల్లూరులోనే 125 హిందూ దేవాలయాల నిర్మాణం
వైఎస్ జగన్ గంగాధర నెల్లూరులోనే సుమారు 125 హిందూ దేవాలయాలు నిర్మించారని చెప్పారు. కనిగిరి కొండ(పెనుమూరు), వరదవెంకటేశ్వరస్వామి(ఆళత్తూరు) ఆలయాలను టీటీడీలో విలీనం చేయడమే కాకుండా ఆ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత జగనన్నదే అని గుర్తుచేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబు కోవలో విజయసాయి రెడ్డి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఆయనపై నమ్మకంతో అన్ని వ్యవహారాలను అప్పగించినా ఆయన కూడా జగనన్నకు వెన్నుపోటు పొడవడం బాధాకరమన్నారు.


