● డీఈఓ లక్ష్మీనారాయణ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోందని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాల పెంపు, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న పలు కీలక సంస్కరణలను సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన మాటల్లోనే...
● కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో పనిచేస్తున్న 18 మంది లెక్చరర్లకు 3 మండలాల చొప్పున దత్తత ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. పాఠశాలల క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ఎంఈఓ, సీఆర్పీ, తదితర సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం.
● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. విద్యార్థుల సమగ్ర విద్యా ప్రమాణాలను తల్లిదండ్రులు సులభంగా తెలుసుకునేందుకే ప్రభుత్వం లీప్ యాప్ను తీసుకువచ్చింది. జిల్లాలోని 2,424 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,99,787 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు 37,873 మంది తల్లిదండ్రులు ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో లీప్ యాప్ను డౌన్్ లోడ్ చేయించేలా చర్యలు చేపట్టాం.
● పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నాం. ప్రతిరోజూ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తా. విధి నిర్వహణలో అలసత్వం, లోటుపాట్లను సహించం.
● విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఉపాధ్యాయులందరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మెనూ పాటించకపోయినా, భోజన నాణ్యతలో లోపాలు కనిపిస్తే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.


