ఐరాల : లాభసాటి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు. మంగళవారం మండలంలోని 45 కొత్తపల్లెలో జిల్లా వ్యవసాయాధికారి మురళి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుతున్న కాలనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ఫ్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలపై పంచసూత్రాల విధానాన్ని రైతులు అవలంబించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వలన జరిగే మేలును వివరించాలన్నారు. జిల్లా వ్య వసాయాధికారి మురళి మాట్లాడుతూ.. రైతులు ఒకే రకం పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను సాగు చేసుకోవాలని, ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలన్నారు. పంటల సాగుకు నీటిని పొదుపుగా వాడడంతో పాటు, భూగర్భ జలాలను పెంచే విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యసాయం జెడ్బీఎన్ఎఫ్ నుంచి పీఎండీఎస్ కిట్స్ 25 రకాల ధాన్యాలు రైతులకు పంపిణీ చేశారు. జేసీ రైతులకు పంచ సూత్రాల కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమామహేశ్వరి, డీఆర్సీ ఏఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ లోకేశ్వరి, ఎంపీడీఓ చంద్రశేఖర్రెడ్డి, ఏఓ శివప్రసాద్, ఆర్ఎస్కే సిబ్బంది రామచైతన్య, నరేష్, శంకర్, అశ్విని, జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది భారతి, యతీంద్రనాయుడు, రేఖ, వాణి, రైతులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి మురళి
రైతులకు ధాన్యాలు పంపిణీ చేస్తున్న జేసీ


