గువాహటి: అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విపక్ష కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు.
ఈ సందర్భంగా లేఖలో..‘తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నా’ అని ప్రద్యుత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా ప్రద్యుత్ను రాజకీయంగా మభ్యపెట్టారు. అదీ కాకుండా ఆయనకు కుటుంబ విబేధాలు ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ ఏప్రిల్ 9న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మార్గేరీటీ స్థానం కాంగ్రెస్ తరఫున పోటీపడుతున్నారు. కాగా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


