నగరి : పట్టణంలో మూగజీవిపై అమానుష దాడి చోటుచేసుకుంది. కూరగాయలు తినిందనే కారణంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గోమాతను తీవ్రంగా గాయపరిచిన ఘటన బస్టాండు ప్రాంగణంలోని సంత మైదానంలో కలకలం రేపింది. మున్సిపల్ పరిధిలోని కీలపట్టు దళితవాడకు చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి చెందిన ఆవు చూలుతో ఉంది. ఏమరపాటుగా వదిలేయడంతో ఆవు సోమవారం సాయంత్రం సంత మైదానంలోకి వెళ్లి కొన్ని దుకాణాల వద్ద ఉన్న కూరగాయలను తిన్నట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న గుర్తుతెలియని దుకాణదారు, ఎవరూ లేని సమయంలో ఆవు వెనుక భాగంలో కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆవును వెతుక్కుంటూ వచ్చిన యజమాని సోమవారం రాత్రి ఆవు ఆక్రందన విని అక్కడికి చేరుకోగా, తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించింది. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు 24 కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. మూగజీవిపై ఇలాంటి క్రూర చర్యకు పాల్పడిన నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


