చిత్తూరు రూరల్ (కాణిపాకం ): చిత్తూరు నగరంలో కరెంట్ షాక్తో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంం.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం చిత్తూరు నగరంలోని గోపాలపురం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలోని మోటార్ను ఆన్ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
శాంతిపురం: మండలంలోని ఎంకేపు రం పంచాయతీ, కృష్ణాపురానికి చెందిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృత్యువా త పడ్డాడు. గ్రా మానికి చెందిన ఖాదర్బాషా కుమారుడు నవా జ్(19) శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం బంధువులు, మిత్రులు గ్రామ పరిసరాల్లో గాలించారు. కృష్ణాపురం–పొన్నేపల్లి మధ్య ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని మామిడి తోటలో చెట్టుకు వేలాడుతున్న నవాజ్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్లు చూస్తే కొట్టి చెట్టుకు ఉరి వేసి, అనంతరం తల పగులగొట్టి నట్టుగా ఉంది. పోలీసులు మృతదేహాన్ని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శాంతిపురంలో ఓ మోటారు రీ వైండింగ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్న నవాజ్ వివాద రహితుడుగా కృష్ణాపురం వాసులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో కేసును ఛేదించడానికి పోలీసులు ఆధారాల సేకరణ కోసం ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.
ఎద్దుల పందేలకు
వెళ్లి వ్యక్తి దుర్మరణం
కుప్పం రూరల్: ఎద్దుల పందేలు చూసేందుకు వెళ్లి అక్కడ ఎద్దు పొడవగా వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన రామకుప్పం మండలం, పీఎంకే తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. రామ కుప్పం మండలం, కావలిమడుగు గ్రామానికి చెందిన రాజప్ప(50) ఎద్దుల పందేలను చూ సేందుకు ఆదివారం పీఎంకే తండాకు వెళ్లాడు. అక్కడ ఓ ఎద్దు మీదికి వచ్చి రాజప్పను పొడి చింది. రాజప్ప తీవ్రంగా గాయపడ్డాడు. సహ చరులు హుటాహుటిన కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజప్ప ప్రాణాలు వదిలాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైఎస్ జగన్ పరామర్శ
పెనుమూరు (కార్వేటినగరం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తల్లి విజయా రెడ్డి వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్ర సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డిని ఫోన్లో ఓదార్చి పరామర్శించారు. రాకేష్ రెడ్డి తల్లి విజయారెడ్డి మృతిపై సంతాపం తెలిపారు.


