పూతలపట్టు(యాదమరి): అంబులెన్సు 108 వైఫల్యం వలన ఓ యువకుడి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. శనివారం స్థానిక ఎస్వీ సెట్ కాలేజీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల వివరాలు మేరకు..గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు గ్రామానికి చెందిన హేమంత్ చిత్తూరు నుంచి ఎస్వీ సెట్ కాలేజీ సర్వీస్ రోడ్డు వైపుగా వస్తున్నాడు. అదే సమయంలో జశ్వంత్, పునీత్ అనే యువకులు కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. చావు బతుకులు మధ్య పోరాటం చేస్తున్న యువకులకు ప్రాణదానం చేయాల్సిన అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో హేమంత్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే ఆటోలో పక్కనే ఉన్న ఆర్వీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం , అత్యవసర సమయంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వలనే బాధితులు పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.


