గంగవరం : మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా సిలిండర్లు సక్రమంగా అందకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. గంగవరంలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు శనివారం భారీగా జనం చేరుకున్నారు. ఏజెన్సీ సిబ్బంది టోకెన్ల వారిగా ఒక్కొక్కరికీ సిలిండర్లు అందజేశారు. అందరికీ సిలిండర్లు ఇవ్వాల్సిందేనని వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకులపై ఘర్షణకు దిగారు. ఈక్రమంలో కార్యాలయ అద్దాలను పగులగొట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సిలిండర్లు బుక్ చేసుకుని వారం గడిచినా తమకు సిలిండర్లు సరఫరా కాలేదని ఇళ్లలో వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలగజేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. సీఐ రాంభూపాల్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు డిమాండ్ ఎక్కడా లేదని అవసరమైన వారు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే నేరుగా మీ ఇళ్లకే సరఫరా జరుగుతుందన్నారు. అంతేగానీ సిలిండర్ల కొరత అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.


