చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని డీఈవో రాజేంద్రప్రసా ద్ అన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేసి న ఏర్పాట్లను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పది పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 219 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9032185001 ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విద్యాసంవత్సరం రెగ్యులర్ విధానంలో బాలురు 10,787, బాలికలు 10,264 మొత్తం 21,051, ప్రైవేట్ (వన్స్ ఫెయిల్డ్) విధానంలో బాలురు 1,318, బాలికలు 726, మొత్తం 2,044 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో సూపరింటెండెంట్ స్వర్ణ, పది పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, సిబ్బంది మురళి, సల్లార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ బస్సుల్లో హాల్టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారన్నారు.
144 సెక్షన్ అమలు
జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఈవో తెలిపారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను కచ్చితంగా మూసివేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల కేంద్రాల్లో ఉండే జిరాక్స్ మిషన్లు ప్రత్యేక రూంలో భద్రపరచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష విధుల్లో ఉండే చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్, ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్ఫోన్ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేటప్పుడు ద్విచక్రవాహనాలను వాడకూడదన్నారు.


