కార్మికులకు సంక్షామం
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ మెమో 1214 రద్దు చేయాలి.
కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఇస్తున్నట్టుగానే ఏపీలోనూ ప్రమాద బీమా రూ.10 లక్షలు అమలు చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెత్ క్లెయిమ్స్ను వెంటనే చెల్లించాలి.
సంక్షేమ బోర్డు ఏర్పాటు హుళక్కే! నిధులు పక్కదారి పట్టించిన వైనం ఎన్నికల హామీలను అటకెక్కించిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
పుత్తూరు: అన్యాయం చేయడంలో చంద్రబాబు అందరికీ సమన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు, నేతన్నలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు సైతం అన్యా యం చేస్తున్నారు. కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటానని గత సార్వత్రిక ఎన్నికల్లో నమ్మబలికి అధికారంలోకి వచ్చాక హామీలన్నింటిని ఇసుకతో కప్పెట్టేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లేబర్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 1,44,525 మంది ఉన్నారు. ఒడిశా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి అనధికారికంగా మరో లక్ష మంది ఉంటారని అంచనా. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులకు అండగా ఉంటానని నిలువునా మోసం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఎన్నికల హామీలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1214 మెమోను రద్దు చేస్తా మని వెల్లడించారు. కార్మికులకు షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల పిల్లల చదువుకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామని పేర్కొన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఇస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. ప్రమాద మరణ బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. రెండేళ్లవుతున్నా ఈ హామీలను అమలుచేయకుండా గాలికొదిలేశారు.
సుప్రీం కోర్టు ఆదేశించినా..
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, బోర్డు సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వాడుకోకూడదని ఆదేశించింది. ఆ ఆదేశాలను సైతం చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.
భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు
పేరుకు పోతున్న డెత్ క్లెయిమ్స్ బకాయిలు
2016 నుంచి డెత్ క్లెయిమ్స్ బకాయిలు రూ.7.71 కోట్లు ఉన్నాయి. గడిచిన 20 నెలల్లో లేబర్ కార్డు ఉన్న 91 మంది కార్మికులు పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వంతున రూ.4.55 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం డెత్ క్లెయిమ్స్ బకాయిలు రూ.12.26 కోట్లకు చేరాయి. కుటుంబానికి ఆధారమైన వారు మృత్యువాత పడడంతో వారి భార్య, పిల్లలు వీధిన పడ్డారు. ఈ క్రమంలో పేద కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రధాన డిమాండ్లు
ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందాన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అన్ని వర్గాలకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక మోసం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, సంక్షేమ పథకాలు ఇస్తామని.. 1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని అమలు చేస్తామని కుప్పం ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని పేజీ నంబర్ 6లో లేబర్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు. అధికారంలోకి ఇచ్చి రెండేళ్లు అవుతున్నా సంక్షేమ బోర్డు ఊసే ఎత్తడం లేదు. హామీల గురించి అసలు పట్టించుకోవడం లేదు. పైగా ఉచిత ఇసుక పేరిట తమ పచ్చనేతలకు దోచి పెడుతున్నారు. దీంతో భవన నిర్మాణ పనులు లేక కార్మికులు రోడ్డున పడుతున్నారు.
కార్మికులకు సంక్షామం


