
కార్డున్న చోటే బియ్యం!
● డీలర్లకు ఇచ్చే అదనం 10 శాతం కట్ ● కేటాయింపుల మేరకే బియ్యం సరఫరా ● స్థానికేతర కార్డుదారులకు తప్పనితిప్పలు ● కొత్తగా ఎక్కడ కార్డు ఉంటే అక్కడే బియ్యం నిబంధనలు ● 31 మండలాలకు ముగ్గురే సివిల్ సప్లయి డీటీలు ● అధికారుల పర్యవేక్షణ కరువు
స్థానికేతరుల పరిస్థితి దారుణం
జీవనోపాధి కోసం బయటకు వలస వెళ్తే గతంలో అక్కడే రేషన్ తీసుకునే సదుపాయం ఉండేది.కానీ ప్రస్తుతం అలా లేదు.సంబంధించిన షాపుల్లోనే సరుకులు తీసుకోమని డీలర్లు చెబుతున్నారు. దాంతో ఉపాధి కోసం బయటిజిల్లాలకు వలస వెళ్తే ఇక రేషన్ ఇవ్వమంటే ఎలా బతకాలి.
– రమేష్ యాదవ్, దొనిరేవులపల్లి
ఎక్కడైనా ఇచ్చేలా వెసులుబాటు కల్పించాలి
ముందు మాదిరి ఇప్పుడు లేదు. అప్పుడు రేషన్ బండి ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేది. ఇప్పుడు బండిని ఆపేశారు. రేషన్ షాపులోకి వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు పడిగాపులు కాస్తున్నాం. ఇక్కడ ఇవ్వని పక్షంలో వేరే షాపునకు వెళ్తే రేషన్ ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. ఆ వెసులుబాటు అయినా కల్పించాలి. – మహేశ్వరి ఏడీ కండ్రిగ
అందరికీ రేషన్ ఇవ్వాలి
బియ్యం కోసం డీలర్ వద్దకు వచ్చే ప్రతి కార్డుదారుడికి బియ్యం ఇవ్వాలి. 10 శాతం బియ్యాన్ని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి ఇచ్చిన బియ్యం అయిపోతే...స్టాక్ లేకుంటే సివిల్ సప్లయి అధికారులకు సమాచారం ఇస్తే మళ్లీ గోదాము వద్ద నుంచి బియ్యం పంపుతాం. మిగిలిన మండలాలకు ఏర్పాటు చేస్తాం. జిల్లాలో డీలర్లు లేని వాటిని భర్తీ చేస్తాం.
– శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు
కాణిపాకం : అంతా ఆన్లైన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఎక్కడున్నా.. రాష్ట్రంలోని ఏ రేషన్ డీలరు వద్దనైనా నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఇప్పటి వరకు ఉండేది. ఈ నిబంధన 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారు. అంతేకాకుండా సాధారణంగా ఆ రేషన్ డీలర్కు ఇవ్వాల్సిన సరుకుల అలాట్మెంట్తో పాటు అదనంగా 10 శాతం బియ్యం ఇచ్చేవారు. దీంతో డీలర్ తమ పరిధిలోని రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడంతోపాటు ఆ అదనపు బియ్యాన్ని సమీప ప్రాంతాలకు చెందిన వారు వస్తే వారికి ఇచ్చేవారు. తాజాగా ఈనెల నుంచి అదనపు బియ్యాన్ని కట్ చేశారు. దీంతో రేషన్కార్డు ఒకచోట ఉండి..వేరేచోట పనులు చేసుకునేవారికి బియ్యం ఇవ్వమని డీలర్లు చెబుతుండడంతో స్థానికేతర కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
రేషన్ డీలర్లకు వారికి వచ్చే బియ్యంతో పాటు అదనంగా ఇస్తున్న 10శాతం బియ్యాన్ని కట్ చేశారు. దీంతో 90శాతం రేషన్ డీలర్లు తమ షాపు పరిధిలోని కార్డుదారులకు మాత్రమే బియ్యం ఇస్తున్నారు. దీంతో స్థానికేతరులకు బియ్యం ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కిలో తగ్గించి ఇవ్వాలని..
ఉపాధి నిమిత్తం ఇతర జిల్లాలకు చెందిన పలువురు పెద్ద సంఖ్యలో జిల్లాకు వచ్చారు. వీరంతా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వీరు రేషన్ డీలర్ వద్దకు వెళ్లి బియ్యం ఇవ్వమని అడుగుతున్నారు. స్థానికేతరులకు ఇవ్వడం కుదరని చెప్పడంతో ఒక కేజీ తగ్గించి ఇవ్వమని పప్రాధేయపడుతున్నారు.
ముగ్గురే సివిల్ సప్లయి డీటీలు
రేషన్ డీలర్ల పనితీరును పర్యవేక్షణ చేయడానికి ఒక్కో మండలానికి ఒక్కో సివిల్ సప్లయి డీటీ ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. అయితే కూటమి సర్కారులో జిల్లాలో 31 మండలాలు ఉంటే కేవలం మూడు మండలాలకు మాత్రమే సివిల్ సప్లయి డీటీలు పనిచేస్తున్నారు. మిగిలిన 31 మండలాలకు డీటీలు లేరు. దీంతో డీలర్ల పనితీరును చూసే అధికారే కరువయ్యారు. మరోవైపు జిల్లాలో 1390 రేషన్ దుకాణాలు ఉంటే 200కు పైగా డీలర్లు లేరు. సమీపంలోని పక్క డీలర్లకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. అక్కడి పరిస్థితులు గందరగోళంగా మారాయంటూ చర్చించుకుంటున్నారు.
ఎండీయూ వాహనాలు రద్దు
గత వైఎస్సార్సీపీ సర్కారు తీసుకొచ్చిన 336 ఎండీయూ వాహనాల ద్వారా నేరుగా ఇంటికే వచ్చి కార్డుదారులకు సరుకులు ఇచ్చేవారు. ఆ వాహనాలను రద్దు చేశారు. డీలర్ వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలనే నిబందనలు పెట్టారు. డీలర్లు అడిషనల్ కోట 10శాతం బియ్యం ఇవ్వకపోవడంతో 1 నుంచి 6వ తేదీకే సరుకులు ఇచ్చేశామంటూ దుకాణాలను మూత వేస్తున్నారు.

కార్డున్న చోటే బియ్యం!

కార్డున్న చోటే బియ్యం!

కార్డున్న చోటే బియ్యం!