మేం ఇక్కడే ఉంటాం! | - | Sakshi
Sakshi News home page

మేం ఇక్కడే ఉంటాం!

Aug 1 2025 11:52 AM | Updated on Aug 1 2025 11:52 AM

మేం ఇక్కడే ఉంటాం!

మేం ఇక్కడే ఉంటాం!

● మంత్రి సమీక్షలో బట్టబయలైన అధికారుల తీరు ● 2018లో కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్‌–12 కేటాయింపు ● మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలోనే డివిజన్‌ నిర్వహణ ● సీఎం చంద్రబాబుకే మస్కా ● రూ.169 కోట్ల పనులున్నా మదనపల్లె నుంచే పర్యవేక్షణ ● అధికారులు హెడ్‌క్వార్టర్‌ కుప్పంలో నివాసం లేరని మంత్రే నిర్ధారణ

మదనపల్లె: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పనిచేయాల్సిన హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు కుప్పానికి వెళ్లకుండా మదనపల్లెను వదలకుండా ఉండిపోతున్నారు. కుప్పంలో రూ.కోట్ల పనులు జరుగుతున్నా మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడి నుంచే పర్యవేక్షి స్తామన్నట్లుగా అధికారుల ధోరణి వ్యక్త మవుతోంది. సాధారణంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే సాహసం ఏ అధికారీ చేయడు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులకు మాత్రం ఆ సాహసం ఉందని చెప్పాలి. 2018లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్‌–12 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా కుప్పానికి తరలి పోయి అక్కడి నుంచే పాలన సాగించాలి. అయితే ఈ ఉత్తర్వు కేవలం కాగితానికే పరిమితమయ్యాయి. ఈ ఉత్తర్వు సమయంలో కుప్పం ఉపకాలువ పనులు సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణ సులువుగా, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం నియోజకవర్గమైతే మాకేంటి అనుకున్నారేమో కుప్పంలో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయకుండా, మదనపల్లె నుంచే విధులు నిర్వహిస్తున్నారు.

అంతా మదనపల్లె నుంచే

మదనపల్లెలో ప్రాజెక్టు సర్కిల్‌–3 కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి కుప్పంకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం రూ.169 కోట్లతో రెండు రీచ్‌లతో కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయి. కుప్పం కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేసుంటే ఇక్కడి నుంచి పర్యవేక్షణ పక్కగా జరిగేది. ప్రస్తుతం మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న కుప్పం డివిజన్‌ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండడంతో రోజూ కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ సాగించాల్సి వస్తోంది. బుధవారం ఈఈ వెంకటేశ్వర్లు కార్యాలయం ఉండి ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు. ఇంతవరకు కుప్పంలో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం, కనీసం అక్కడి నుంచైనా విధులు నిర్వహించకపోవడంతో కుప్పం లైనింగ్‌ పనుల పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.

ఈఈకి మూడు చార్జ్‌ మెమోలు

కుప్పం లైనింగ్‌ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్లుకు ఏకంగా మూడు చార్జ్‌ మెమోలను జారీ చేయాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించడం హంద్రీ–నీవా ప్రాజెక్టు వర్గాల్లో కలకలం రేగాలి. అయితే దీనిపై అధికారులు టేకిట్‌ఈజీ అన్న ధోరణిలో కనిపిస్తున్నారు. సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీస స్పందనం లేదు. మంగళవారం మంత్రి ప్రాజెక్టు ఉపకాలువల పనులపై జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించారు. కుప్పం కాలువ పనులకు సంబంధించి ఈఈ మీటింగ్‌కు హజరుకాలేదు. దీనికితోడు హెడ్‌క్వార్టర్‌ కుప్పం లేరని నిర్ధారించి చర్యలకు ఉపక్రమించారు. ఈ చార్జ్‌మెమోలను తిరుపతి చీఫ్‌ ఇంజినీర్‌ జారీ చేస్తారని ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్‌ బుధవారం సాక్షికి చెప్పారు.

తదుపరి చర్యలేమిటి?

మంత్రి మదనపల్లెలో జరుగుతున్న కుప్పం డివిజన్‌ కార్యకలాపాలపై దృష్టి పెడతారా లేదా అన్నది తేలాలి. ఈఈ హెడ్‌క్వార్టర్‌లో నివాసం లేరని తేల్చగా ఇప్పుడు అక్కడ డివిజన్‌ కార్యాలయమే ఏర్పాటు చేయని అంశంపై ఎలా స్పందించాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి. ఏడేళ్లకుపైగా కార్యాలయం ఏర్పాటు చేయకుండా అధికారులు ఎలా విధులు నిర్వహించారో తేల్చాలి. ఈఈపై చర్యలకు ఉపక్రమించిన మంత్రి ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ధిక్కరించి మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో డివిజన్‌ కార్యాలయం నిర్వహణపై ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement