
● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక ద
మొగిలి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన స్పీడ్బ్రేకర్లు
బ్లాక్స్పాట్గా చిత్తూరుకు సమీపంలోని మురకంబట్టు కూడలి
బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద 2024 సెప్టెంబర్ 13వ తేదీన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఒక్క ఘటనే కాదు.. నిత్యం జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, రవాణా, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ప్రతివారం సమీక్షలు, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై లోతుగా చర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైనది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాలు కావడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందే వ్యక్తుల కుటుంబాలు చీకటిమయం అవుతున్నాయి. డ్రైవింగ్ అలసత్వం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల బతుకులు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిర్ధిష్ట ప్రణాళిక అమలుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.
సహాయం ముఖ్యం
ఒక కుటుంబంలో ఎవరైనా ప్రమాదాల బారినపడి మృతి చెందితే ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి, కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే అలసత్వాన్ని వీడాలి. మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేలా అధికారులు, 108 వాహనాలు, డాక్టర్లు, పోలీసుల నంబర్లను తెలుసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సహాయం నిమిత్తం 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలను
బ్లాక్స్పాట్లుగా..
జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించారు. ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 25 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్లైట్లు, హైవేలపై వేగ నియంత్రణకు లేజర్ స్పీడ్ గన్స్, వేగాన్ని నియంత్రించేందుకు బ్లాక్స్పాట్స్ సమీపంలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలం వాహనదారులకు తెలిసేలా పవర్ బ్లంకర్స్,సైన్ బోర్డులు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, సోలార్ స్టెన్స్ ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్లు ఇవే..
● ఎన్ హెచ్– 69 రోడ్డులో.. : ఎంఎస్ఆర్ క్రాస్, చీలాపల్లి క్రాస్, గంగాసాగరం వద్ద ఉన్న ఆర్ఎంఎం ఫ్యాక్టరీ , యాదమరి జంక్షన్, వరిగపల్లి జంక్షన్, కేజీ సత్రం, మొగిలి ఘాట్ (శ్రీనీఫ్యాక్టరీ వద్ద), దొర చెరువు (మొగలి ఘాట్), జగమర్లక్రాస్, దండపల్లి (వి.ఎస్.ఆర్) జంక్షన్, పొన్నమాకులపల్లి క్రాస్, అలకుప్పం (కుక్కలదొడ్డి క్రాస్).
● ఎన్హెచ్ 42 రోడ్డు : గొల్లపల్లి క్రాస్, దేవదొడ్డి, కుమ్మరమడుగు క్రాస్, జువనిపల్లి క్రాస్, నాయనపల్లి పెట్రోల్ బంక్, విజలపురం క్రాస్, కె.సి హాస్పిటల్.
● ఎన్హెచ్ 40 రోడ్డు : మురకంబట్టు జంక్షన్, ఎన్ హెచ్ 140 లో తెల్లగుండ్ల పల్లి క్రాస్, పి.కొత్తకోట రైల్వే అండర్ బ్రిడ్జి,
● ఎన్హెచ్ 716 లో హెచ్పీ పెట్రోల్ బంక్, గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా, మిట్ట ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
25 బ్లాక్స్పాట్స్లో
2024 సంవత్సరంలో ప్రమాదాలు ఇలా...
లైట్వెయిట్ వాహన ప్రమాదాలు 249
ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 209
గాయపడినవారు 510 మంది
మృతిచెందిన వారు 228 మంది
ద్విచక్రవాహన ప్రమాదాల్లో మృతులు 128
2025 మార్చి నెల వరకు
ప్రమాదాలు ఇలా..
లైట్ వెయిట్ వాహనాల ప్రమాదాలు 53
ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 63
గాయపడిన వారు 153 మంది
ప్రమాదాల్లో మృతి చెందినవారు 51 మంది
పాటించాల్సిన నియమాలు
ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
మద్యం తాగి వాహనాలు నడపరాదు.
మూల, మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలి.
వాహనం నడుపుతున్న సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పెద్ద వాహనాలకు దూరంగా ఉండాలి.
కార్లల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు వినియోగించాలి.
జిల్లాలో డివిజన్ల వారిగా గుర్తించిన బ్లాక్స్పాట్లు
డివిజన్ ఎన్హెచ్–69 ఎన్హెచ్–42 ఎన్హెచ్–140 ఎన్హెచ్–40 ఎన్హెచ్–716 మొత్తం
చిత్తూరు 7 0 2 2 0 11
పలమనేరు 6 3 0 0 0 09
కుప్పం 0 2 0 0 0 02
నగరి 0 0 0 0 3 03
మొత్తం 13 5 2 2 3 25

● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక ద

● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక ద

● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక ద