
బాలికల భద్రతే.. దేశ బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : కిశోర బాలికల భద్రతే దేశ బాధ్యత అని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరి అన్నారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లాస్థాయిలో కిశోరవికాసం– సమ్మర్ స్పెషల్ కార్యాచరణపై మండల స్థాయిలో వివిధ శాఖల నుంచి హాజరైన నోడల్ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ కిశోర బాలికల సాధికారతకు ప్రతి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ క్యాలెండర్ ప్రకారం గ్రామాల్లో ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. బాల్య వివాహాల కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని తెలిపారు. నేడు చాలా వరకు అన్నీ పోటీ పరీక్షలలో బాలికలదే పైచేయిగా ఉన్నప్పటికీ, ఎంతో మంది కిశోర బాలికలు తమ కళలను నెరవేర్చుకోక ముందే బాల్య వివాహాలకు బలైపోతున్నారని అన్నారు. మరి కొంతమంది బాల కార్మికులుగా మారిపోతున్నారని చెప్పారు. మరొకవైపు బాలికలు ఇంటా బయట, తెలిసిన వ్యక్తుల చేతుల్లో లైంగిక వేదింపులకు గురై చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారన్నారు. మరికొంత మంది తెలియని తనంతో ప్రేమ, ప్రలోభాలకు గురై, నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం, ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మి, సమగ్రశిక్ష జీసీడీఓ ఇంద్రాణి, ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు.