అంతర్జాతీయ పరిణామాలపై ఫోకస్
రుతుపవనాల కదలికపైనా దృష్టి
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం
దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ల మధ్య జరుగుతున్న దౌత్య చర్చల పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ సమావేశ వివరాలను (ఫెడ్ మినిట్స్) మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.
9 నుంచి కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల సీజన్ షురూ..!
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ జూలై 9 (గురువారం)న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను ప్రకటించి, దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్కు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ యాజమాన్యం ఇచ్చే అవుట్లుక్ వ్యాఖ్యలపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో డిమాండ్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? టెక్నాలజీ రంగంలో కంపెనీలు చేసే వ్యయాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాపార అవకాశాల వేగం ఏ మేరకు ఉంటుంది? అనే విషయాలపై సంకేతాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
‘‘తొలి దశలో విడుదలయ్యే కార్పొరేట్ ఫలితాలు, కంపెనీల మేనేజ్మెంట్ వ్యాఖ్యలు మార్కెట్లో డిమాండ్ పరిస్థితులు, మార్జిన్ల స్థితిగతులు, భవిష్యత్తులో ఆదాయ అంచనాలపై కీలకమైన స్పష్టతను ఇస్తాయి. ఇవే రాబోయే వారాల్లో మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి’’ అని స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్ గౌర్ తెలిపారు.
అమెరికా–ఇరాన్ల దౌత్య చర్చల ప్రభావం
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే పశ్చిమాసియా నుంచి ‘వార్తలు లేకపోవడమే శుభవార్త’ అనే పంథా కొనసాగుతోంది. శాంతి ప్రయత్నాలు ప్రస్తుతానికి బాగానే సాగుతున్నాయి, ఎక్కడా ఉద్రిక్తతలు పెరిగినట్లు నివేదికలు రాలేదు. గత వారం ప్రారంభంలో దోహాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చల తర్వాత ఈ సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్ ప్రస్తుతం నిర్వహిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో తమ షరతులకు దాదాపు అన్నింటికీ ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు.
క్రూడాయిల్ ధరలపై కన్ను
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 72 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా–ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం తర్వాత క్రూడాయిల్ ఎగుమతులు మరింత పెరిగాయి. ఆసియా మార్కెట్లలో అమ్మకాలను మరింత వేగవంతం చేసేందుకు ‘సౌదీ అరామ్కో’ స్పాట్ ప్రైసింగ్ (తక్షణ ధరల విధానం) వైపు మొగ్గు చూపుతోందని రాయిటర్స్ నివేదించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అదుపులో ఉండటం భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు భారీ ఉపశమనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఫెడరల్ రిజర్వ్ మినిట్స్పై దృష్టి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూన్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) జూలై 9న (గురువారం) విడుదల కానున్నాయి. ఇటీవల విడుదలైన యూఎస్ ఆర్థిక గణాంకాలు బలహీనపడటంతో, భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ కొంత ‘సరళతర వైఖరి విధానాన్ని అవలంబించవచ్చు’ అనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో వడ్డీరేట్లు, ఆర్థిక దృక్పథంపై పాలసీ నిర్ణేతల అంచనాలను తెలుసుకోవడం కోసం ఇన్వెస్టర్లు ఈ జూన్ పాలసీ సమావేశ మినిట్స్ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
సాంకేతిక అంశాలు
‘‘నిఫ్టీ ఇండెక్సు డైలీ చార్ట్లో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ను నమోదు చేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనేందుకు స్పష్టమైన సంకేతం’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ తెలిపారు. ‘‘ఇప్పటికీ నిఫ్టీ కీలకమైన 50–రోజుల ఈఎంఏ స్థాయి కంటే పైనే కొనసాగుతోంది. ఇది స్వల్పకాలిక సానుకూల ధోరణిని మరింత బలోపేతం చేస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో నిఫ్టీ 24,500 స్థాయిని ఛేదించి, అంతకు మించిన పైస్థాయిలకు దూసుకెళ్లేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ నష్టపోయినా.. దిగువ స్థాయిలో నిఫ్టీకి 24,200 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఆ తర్వాత 24,000 వద్ద బలమైన సపోర్ట్ జోన్ ఉంది’’ అని రూపక్ విశ్లేíÙంచారు.
గతవారమిలా...
అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో, వడ్డీ రేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ చైర్మన్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో గతవారం (జూన్ 30 నుంచి జూలై 3 మధ్య) దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. గతవారంలో సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్ల చొప్పున పెరిగాయి.


